నకిలీ కరెన్సీ అడ్డా..ఏపీ..! | Fake currency to make form in Andhra pradesh | Sakshi
Sakshi News home page

నకిలీ కరెన్సీ అడ్డా..ఏపీ..!

Sep 8 2015 10:58 PM | Updated on Sep 3 2017 9:00 AM

దేశవ్యాప్తంగా పోలీసు సహా వివిధ నిఘా విభాగాలు స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీలో 17.91 శాతం ఆంధ్రప్రదేశ్‌లోనే దొరికినట్లు కేంద్ర హోంశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

- దేశంలోనే మూడోస్థానంలో నిలిచిన రాష్ట్రం
- దేశవ్యాప్తంగా దొరికిన కరెన్సీలో 17.91 శాతం ఇక్కడే
- తొలి రెండు స్థానాల్లో గుజరాత్, ఛత్తీస్‌గఢ్
- నకిలీ రూ.వెయ్యి నోట్ల విషయంలో ఏపీకి నాలుగో స్థానం
- స్పష్టం చేస్తున్న కేంద్ర హోం శాఖ గణాంకాలు


సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పోలీసు సహా వివిధ నిఘా విభాగాలు స్వాధీనం చేసుకున్న నకిలీ కరెన్సీలో 17.91 శాతం ఆంధ్రప్రదేశ్‌లోనే దొరికినట్లు కేంద్ర హోంశాఖ తాజాగా విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాది దేశంలోని 29 రాష్ట్రాలు, ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం రూ.3, 03, 54, 604 విలువైన నకిలీ కరెన్సీ లభ్యమైంది. ఇందులో రూ.54, 37, 600 విలువైన కరెన్సీతో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో నిలిచినట్లు గణాంకాలు వెల్లడించాయి. రూ.87, 47, 820తో గుజరాత్ తొలిస్థానంలో, రూ.73, 86, 900తో ఛత్తీస్‌గఢ్ రెండో స్థానంలో ఉన్నాయి. స్వాధీనమవుతున్న నకిలీ కరెన్సీలో అత్యధిక భాగం పాకిస్తాన్ భూ భాగంలో ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్‌ఐ కనుసన్నల్లో ముద్రతమవుతున్నట్లు హోం శాఖ అనుమానిస్తోంది. నిపుణులు సైతం గుర్తించలేని విధంగా ఈ కరెన్సీ ముద్రితమవుతుండటమే దీనికి నిదర్శనమని అధికారులు చెప్తున్నారు.

ప్రధానంగా నకిలీ నోట్లలో రూ.1,000, రూ.500 నోట్లే అధికంగా ఉంటున్నాయి. దీంతో కరెన్సీ నోట్ల ముద్రణలో ఆర్‌బీఐ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. సెక్యూరిటీ ఫీచర్స్‌ను ఎప్పటికప్పుడు మారుస్తోంది. అయినప్పటికీ పాక్‌లో ముద్రితమవుతున్న నకిలీ కరెన్సీ నోట్లు, అసలు నోట్ల మధ్య తేడాలు రానురాను తగ్గిపోతుండడం ఆందోళనకరమని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. పాకిస్తాన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పవర్ ప్రెస్‌లోనే ఫేక్ కరెన్సీని ముద్రిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు.

గతేడాది దేశవ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న రూ.3, 03, 54, 604 విలువైన నకిలీ కరెన్సీలో రూ.1, 98, 95, 000 విలువైనవి రూ.1,000 డినామినేషన్ నోట్లే కావడం గమనార్హం. దీంతోపాటు రూ.94, 090, 500 విలువైన రూ.500 నోట్లు, రూ.9, 38, 800 విలువైన రూ.100 నోట్లు, రూ.25 వేల విలువైన రూ.50 డినామినేషన్ నోట్లు ఉన్నట్లు హోం శాఖ లెక్కకట్టింది. రూ.1,000, రూ.500 మినహా మిగిలిన డినామినేషన్‌లో ఉండే నకిలీ నోట్లను స్థానికంగా ఉన్న ముఠాలే ప్రింటర్లు, స్కానర్ల ద్వారా రూపొందిస్తున్నట్లు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.24,41,000 విలువైన రూ.1,000 డినామినేషన్ నోట్లు లభ్యమయ్యాయి. ఈ విషయంలో దేశంలోనే ఏపీ నాలుగో స్థానంలో నిలిచినట్లు హోం శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement