ఎయిర్‌టెల్.. ట్రింగ్ | Bhari Airtel, Idea's Fitting Q3 Results Bring New Hopes For Telecom | Sakshi
Sakshi News home page

ఎయిర్‌టెల్.. ట్రింగ్

Jan 30 2014 1:15 AM | Updated on Sep 2 2017 3:09 AM

ఎయిర్‌టెల్.. ట్రింగ్

ఎయిర్‌టెల్.. ట్రింగ్

టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ అక్టోబర్-డిసెంబర్(క్యూ3)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది.

 న్యూఢిల్లీ: టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ అక్టోబర్-డిసెంబర్(క్యూ3)లో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 610 కోట్లను తాకింది. గతేడాది(2012-13) ఇదే కాలంలో రూ. 284 కోట్లను మాత్రమే ఆర్జించింది. గడిచిన నాలుగేళ్లలో తొలిసారి లాభాల్లో వృద్ధిని సాధించింది.

గత 15 త్రైమాసికాలుగా కంపెనీ లాభాలు తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. మొబైల్ డేటా ఆదాయం పుంజుకోవడంతోపాటు, వాయిస్ సర్వీసులకు మెరుగైన ధర లభించడం లాభాల వృద్ధికి దోహదపడింది. ఇక ఇదే కాలానికి కంపెనీ మొత్తం ఆదాయం 13%పైగా పెరిగి రూ. 21,939 కోట్లకు చేరింది. గతంలో రూ. 19,362 కోట్లు నమోదైంది. కన్సాలిడేటెడ్ మొబైల్ ఇంటర్నెట్ ఆదాయం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 1,736 కోట్లను తాకింది.

 డేటా విభాగం భేష్..
 దేశీయంగా ప్రస్తుతం డేటా వినియోగం నుంచే అత్యధిక ఆదాయం లభించనున్నట్లు కంపెనీ జేఎండీ గోపాల్ విఠల్ పేర్కొన్నారు. ఇండియాలో వినియోగదారుల సంఖ్య 31% జంప్‌చేసి 5.44 కోట్లకు చేరినట్లు వెల్లడించారు. డేటా వినియోగం కూడా 54.4%ను తాకడంతో ఒక్కో వినియోగదారునిపై లభించే డేటా ఆదాయం రూ. 75కు చేరినట్లు కంపెనీ తెలిపింది.
 వాయిస్ సర్వీసులతో కలిపి మొత్తంగా ఒక్కో వినియోగదారుడిపై లభించే సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 195ను తాకినట్లు వివరించింది. ఈ కాలంలో మొబైల్ ఇంటర్నెట్ రేట్లను 25% పెంచింది. వివిధ పథకాల్లో ప్రకటించే మినహాయింపులలో 50% కోత విధించింది. వాయిస్ సర్వీసులలోనూ డిస్కౌంట్ నిమిషాలను సగానికి తగ్గించింది.

 డిస్కౌంట్లను మరింత తగ్గిస్తాం
 వాయిస్ సర్వీసుల ధరలు ఇప్పటికీ 30-40% తక్కువగానే... దీంతో డిస్కౌంట్ నిమిషాలలో మరింత కోత పెట్టేందుకు అవకాశం ఉందని విఠల్ చెప్పారు. అయి తే సమీప కాలంలో ప్రధాన టారిఫ్‌లను పెంచే యోచన లేదన్నారు. డిసెంబర్ చివరికి కంపెనీ రుణ భారం రూ. 57,643 కోట్లుగా  ఉంది.

 నష్టాలలోనే విదేశీ కార్యకలాపాలు
 ఆఫ్రికా, దక్షిణాసియా కార్యకలాపాల నుంచి ఆదాయం దాదాపు 19% పుంజుకుని రూ. 7,676 కోట్లను తాకింది. అయితే దీనిపై రూ. 1,124 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. అంతక్రితం రూ. 603 కోట్ల నికర నష్టం నమోదైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement