ఆమ్ ఆద్మీపార్టీ తమ అంతర్గత వివాదాన్ని పరిష్కరించుకుంది. లక్ష్మీనగర్ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీని ఎట్టకేలకు పార్టీ సీనియర్ నేతలు చల్లబరిచారు.
ఆమ్ ఆద్మీపార్టీ తమ అంతర్గత వివాదాన్ని పరిష్కరించుకుంది. మంత్రిపదవి దక్కలేదన్న ఆగ్రహంతో బుధవారం నాడు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటుచేస్తానని, అది పార్టీకి ఇబ్బందికరంగా ఉండబోతోందని ప్రకటించిన లక్ష్మీనగర్ ఎమ్మెల్యే వినోద్ కుమార్ బిన్నీని ఎట్టకేలకు పార్టీ సీనియర్ నేతలు చల్లబరిచారు.
సీనియర్ నాయకులు సంజయ్ సింగ్, కుమార్ విశ్వాస్ కలిసి బిన్నీ ఇంటికి మంగళవారం రాత్రి దాటిన తర్వాత వెళ్లారు. చాలాసేపు ఆయనతో చర్చలు జరిపి, నచ్చజెప్పారు. అనంతరం బిన్నీ విలేకరులతో మాట్లాడారు. పార్టీలో గొడవలు ఏమీ లేవని, తనకు మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి ఏమీ లేదని అన్నారు. పార్టీలో అసంతృప్తి అనే వివాదాన్ని మీడియా మాత్రమే సృష్టించిందని, ఇప్పుడు కూడా తాము బిన్నీని సాధారణంగా కలిశామే తప్ప ఇందులో ప్రత్యేకత ఏమీ లేదని సంజయ్ సింగ్, కుమార్ విశ్వాస్ అన్నారు.
ఆరుగురు సభ్యులతో మంత్రివర్గాన్ని అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయనకు అత్యంత సన్నిహితుడైన మాజీ పాత్రికేయుడు మనీష్ సిసోదియా, జెయింట్ కిల్లర్ రాఖీ బిర్లా, సోమ్నాథ్ భారతి, సౌరభ్ భరద్వాజ్, గిరీష్ సోనీ, సతేంద్ర జైన్ ఉన్నారు. తన పేరు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి చెందిన బిన్నీ.. మంగళవారం రాత్రి కేజ్రీవాల్ ఇంటినుంచి ఆగ్రహంగా బయటకు రావడం, ఆయన్ను బుజ్జగించేందుకు ప్రయత్నాలు జరగడం తెలిసిందే.