వైఎస్సార్‌సీపీ వెంటే ప్రజలు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ వెంటే ప్రజలు

Published Wed, Jun 1 2016 12:07 PM

ysr congress party strong in telangana-party state chief secretary konda raghava reddy

  • ప్రభుత్వానిది ప్రచార ఆర్భాటమే..
  •  ప్రజలకు చేసిందేమీ లేదు
  •  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి
  •  సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఒకరిద్దరు నేతలు పోయినంత మాత్రాన వైఎస్సార్‌సీపీకి నష్టం లేదని, ప్రజలు పార్టీ వెంటే ఉన్నారని, జిల్లాలో పార్టీ బలంగా ఉందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మంలో ముఖ్య నాయకుల సమావేశానికి హాజరై మాట్లాడారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రజల గుండెల్లో ఉన్నారని, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలతో అనేకమంది లబ్ధి పొందారని తెలిపారు. నాటి 108, 104 సర్వీసులు, ఇతర సంక్షేమ పథకాలను ప్రభుత్వం కావాలనే విస్మరిస్తోందని ఆరోపించారు. కార్యకర్తలంతా ఏకతాటిపై నిలిచి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా సంక్షేమ పథకాలు ప్రజల దరి చేరలేదని చెప్పారు.
     
    ప్రచార ఆర్భాటమే తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలకు లబ్ధి చేకూరడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గారడీతో ప్రజలను మాయ చేస్తున్నారని విమర్శించారు. ఇంకెంతో కాలం ప్రజలను మభ్య పెట్టలేరని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మెండెం జయరాజు, రాష్ట్రనేత బీవీ.రమణ, జిల్లా నాయకులు జిల్లేపల్లి సైదులు, ఐలూరి మహేష్‌రెడ్డి, గుడిబండ్ల దీపక్, జమలాపురం రామకృష్ణ, ఉదయ్‌కుమార్, కొండపల్లి వెంకయ్య, వాలూరు సత్యనారాయణ, చల్లా శ్రీనివాసరెడ్డి,రాజేష్, ఉండేటి ఏసుపాదం, గుర్రం అన్నపూర్ణ, రుద్రగాని హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
     
     వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం..
     బైపాస్‌రోడ్డు రాపర్తినగర్‌లోని వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్టీ నేతలు కొండా రాఘవరెడ్డి, మెండెం జయరాజు, బీవీ.రమణ, జిల్లేపల్లి సైదులు పాలాభిషేకం చేసి పూలమాల వేశారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, శ్రేణులు వైఎస్సార్ అమర్‌హై.. జై జగన్ అంటూ నినాదాలు చేశారు.
     

Advertisement
Advertisement