పాచికల్లు తాగే మొఖాలంటే క్షమించాలా... | Sakshi
Sakshi News home page

పాచికల్లు తాగే మొఖాలంటే క్షమించాలా...

Published Tue, Sep 9 2014 2:26 PM

పాచికల్లు తాగే మొఖాలంటే క్షమించాలా... - Sakshi

వరంగల్ :  తెలంగాణ ఉనికిని అగౌరపరిస్తే పాతరేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఘాటుగా స్పందించారు.  కాళోజీ శతయ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన మంగళవారం  మీడియా ఆందోళనపై  స్పందించారు. 'మా గడ్డ మీద ఉండాలంటే  మా ప్రాంతానికి సలాం కొట్టాలి.... తెలంగాణప్రాంతాన్ని కించపరిచే ఆ ఛానల్స్ మాకు అక్కరలేదని' అన్నారు. 'పాచికల్లు తాగే మొఖాలంటే క్షమించాలా... పాతర ....పాతర వేస్తాం ..పదికిలోమీటర్ల లోతున' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్ను తిడితే బాధలేదని, తెలంగాణ శాసనసభ్యుల్ని తిట్టడం అవమానకరమన్నారు. తెలంగాణ శాసనసభ్యులంతా ఆ ఛానల్స్పై సమిష్టిగా తీర్మానం చేశాయని .... ఆ వ్యవహారం స్పీకర్ పరిధిలో ఉందన్నారు. దానికి స్పందించిన ఎంఎస్వో ఆ ఛానల్స్ ప్రసారాలు నిలిపివేశారన్నారు. ఈ వ్యవహారాన్ని ఢిల్లీ వరకూ తీసుకుపోయి రాద్ధాంతం చేశారని కేసీఆర్ విమర్శించారు. రెండు ఛానళ్ల ప్రసారాలను నిలిపివేసిన తెలంగాణ కేబుల్ ఆపరేటర్స్ సంఘానికి సెల్యూట్ చేస్తున్నానని ఆయన పేర్కొన్నారు. సంబంధిత ఛానళ్లలో పనిచేస్తున్న స్థానిక ఉద్యోగులు కూడా ఒకసారి ఆలోచించుకోవాలని అన్నారు.

Advertisement
Advertisement