శాంతిభద్రతల పర్యవేక్షణలో అలసత్వం వద్దు | Under the supervision of law and order do not want to fatigue | Sakshi
Sakshi News home page

శాంతిభద్రతల పర్యవేక్షణలో అలసత్వం వద్దు

Sep 28 2014 4:04 AM | Updated on Sep 2 2017 2:01 PM

శాంతిభద్రతల పర్యవేక్షణలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని వరంగల్ అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు అర్బన్ పోలీసు అధికారులకు సూచించారు.

  • పగలు జరిగే దొంగతనాలపై దృష్టి పెట్టండి
  • అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు
  • వరంగల్‌క్రైం : శాంతిభద్రతల పర్యవేక్షణలో అలసత్వం ప్రదర్శిస్తే సహించేది లేదని వరంగల్ అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు అర్బన్ పోలీసు అధికారులకు  సూచించారు. అర్బన్ పోలీసు విభాగం పనితీరుపై శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి అర్బన్ పరిధిలోని సబ్‌డివిజనల్ పోలీసు అధికారులు, సీఐలు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు హాజరయ్యారు.

    ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుల వివరాలు, పరిశోధన పురోగతి, గతంలో నమోదైన పెండింగ్ కేసుల పురోగతితోపాటు నిందితులను అరెస్టు చేయకపోవడానికిగల కారణాలపై అర్బన్ అధికారులతో ఎస్పీ సమీక్ష జరిపారు. శుక్రవారం హన్మకొండలోని గణేష్‌నగర్‌లో జరిగిన దోపిడీపై స్పందిస్తూ దోపిడీ జరిగిన తీరుపై ఎస్పీ అడిగి తెలుసుకున్నారు.

    అర్బన్ పరిధిలో రాత్రి సమయంలో పోలీస్ సిబ్బంది ముమ్మర పెట్రోలింగ్ నిర్వహించడంతో రాత్రి పూట జరిగే దొంగతనాలకు అడ్డుకట్ట వేశామని తెలిపారు. అరుుతే కొద్దికాలంగా నగరంలో పగటి పూట చోరీలు జరగడంపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పగలు కూడా ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించాలన్నారు. అలాగే అధికారులు నిర్వహిస్తున్న పెట్రోలింగ్ తీరు ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ముఖ్యంగా చోరీలు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల సమయంలో జరుగుతున్నాయన్నారు. ఈ సమయంలో అధికారులు తమ సమయాన్ని విశ్రాంతికి కేటాయించకుండా తమ పోలీస్‌స్టేషన్ పరిధిలో ముమ్మర గస్తీ నిర్వహించాలన్నారు.

    నగరంలో చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ముఠా కదలికలను గుర్తించాలన్నారు. అధికారులు తమ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలను సందర్శించి గ్రామాల స్థితిగతులు తెలుసుకోవాలన్నారు. జులాయిలపై దృష్టి పెట్టడంతోపాటు వారి వ్యక్తిగత అలవాట్లపై నజర్ పెట్టాలన్నారు. సమావేశంలో అర్బన్ అదనపు ఎస్పీ యాదయ్య, ఓఎస్‌డీలు వాసుసేన, నాగరాజు కుమార్, అర్బన్ స్పెషల్ బ్రాంచ్, వరంగల్, హన్మకొండ, కాజీపేట, ట్రాఫిక్, క్రైం డీఎస్పీలు జనార్దన్, హిమవతి, దక్షిణామూర్తి, రాజిరెడ్డి, ప్రభాకర్, రాజమహేంద్రనాయక్‌తో పాటు ఇన్‌స్పెక్టర్లు , ఆర్‌ఐలు, సబ్‌ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.
     

Advertisement
 
Advertisement
Advertisement