రేపు ఘనపురానికి సింగూరు నీరు


మెదక్:  కరువు మేఘాలు కమ్ముకుని కర్షకులు కన్నీరు పెడుతున్న వేళ...సింగూర్ ప్రాజెక్టు నుంచిఘనపురం ఆనకట్టకు 0.20 టీఎంసీల నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని ఇన్‌చార్జి కలెక్టర్ డా.ఎ.శరత్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ శరత్ బుధవారం సింగూర్ ప్రాజెక్ట్ నుండి నీరు విడుదల చేయనున్నారు.



 ఖరీఫ్ సీజన్‌లో కార్తెలు కదలిపోతున్నప్పటికీ వరుణుడు కరుణించలేదు. ఘనపురం ఆనకట్ట కింద సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా అందులో కొంతమంది రైతులు తోటివారి బోర్ల సాయంతో వరి తుకాలు వేసుకున్నారు. అప్పటి నుండి చినుకు జాడే లేక పోవడంతో ఎండిపోతున్న వరి తుకాలను రక్షించుకునేందుకు అన్నదాతలు నానా పాట్లు పడుతున్నారు.  ఎరువులు, విత్తనాల కొనుగోలు చేసిన అప్పులు మీద పడనున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తరుణంలో ఇటీవల నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సింగూరు వద్ద ప్రాజెక్టు పనులపై సమీక్షా సమావేశం నిర్వహించగా, ఘనపురం ఆయకట్టుకు సింగూర్ ప్రాజెక్టు నుంచినీటిని విడుదల చేయాలని డిప్యూటీ స్పీకర్‌తో సహా పలువురు ప్రజాప్రతినిధులు, రైతులు కోరారు.



దీంతో స్పందించిన హరీష్‌రావు  సింగూరు నుంచి ఘనపురం ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని మంత్రి హరీష్‌రావు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీఎం కూడా వెంటనే స్పందించడంతో నీటి విడుదల చేయాలని సోమవారం జీఓ వెలువడింది. అయితే మంగళవారం రంజాన్ పండగ ఉండడంతో బుధవారం సింగూర్ నుంచి నీరు విడుదల చేస్తామని డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తెలిపారు. దీంతో ఘనపురం ఆనకట్ట రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు రావాల్సిన 4 టీఎంసీల నీటిని ప్రతి సంవత్సరం విడతల వారీగా వదిలేలా శాశ్వత జీఓ జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top