వచ్చే ఖరీఫ్‌ నాటికి రుణమాఫీ...  | There Will be Debt Waiver By the Next kharif A High Ranking official Said | Sakshi
Sakshi News home page

వచ్చే ఖరీఫ్‌ నాటికి రుణమాఫీ... 

Apr 11 2019 3:59 AM | Updated on Apr 11 2019 3:59 AM

There Will be Debt Waiver By the Next kharif A High Ranking official Said - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఖరీఫ్‌ నాటికి పంటల రుణమాఫీ చేయాలని సర్కారు యోచిస్తోంది. ఈ మేరకు వ్యవసాయశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల కోడ్‌ కొనసాగుతుండటం, ఆ తర్వాత మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నందున రుణమాఫీని ఖరీఫ్‌ ప్రారంభం నాటికి చేయాలని భావిస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రుణమాఫీ కోసం ఇటీవల ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే సర్కారు పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత రుణమాఫీ ఉంటుందని ఓ ఉన్నతస్థాయి అధికారి తెలిపారు. రుణమాఫీకి ఎంతమంది అర్హులనే దానిపై ఇటీవలే రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక అందజేసింది.  

అసెంబ్లీ ఎన్నికల హామీగా..  
కేసీఆర్‌ ప్రభుత్వం గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పంటల రుణమాఫీని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ హామీని నిలబెట్టుకునేందుకు ఇప్పుడు ఏర్పాట్లు చేస్తుంది. అంటే రూ. లక్ష లోపు రుణాలున్న వారందరికీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో పంట రుణాలు మాఫీ కానున్నాయి. రుణాల మాఫీకి కటాఫ్‌ తేదీగా గతేడాది డిసెంబర్‌ 11ని ప్రకటించింది. ఆ తేదీని గడువుగా లెక్కించి అప్పటివరకు తీసుకున్న రుణాన్ని మాఫీ చేయనుంది. బ్యాంకర్ల వద్ద ఉన్న లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 48 లక్షల మందికి రూ. 30 వేల కోట్లు మాఫీ చేయాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 6 వేల కోట్లు ఒక విడతగా కేటాయించిందంటే, మొత్తంగా ఐదు విడతల్లో బ్యాంకులకు చెల్లించే అవకాశముంది. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లోనూ రుణమాఫీ అంశాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement