దేశంలోని ప్రధాన నదీ పరీవాహక ప్రాంతాలు, ప్రధాన డ్యామ్ల పరిధిలో వరద ప్రభావ లెక్కలను గణిస్తున్న కేంద్ర జల వనరుల శాఖ.. రిజర్వాయర్ల వరద లెక్కలపై దృష్టి సారించింది.
► రాష్ట్రాలకు కేంద్ర జలవనరుల శాఖ లేఖ
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రధాన నదీ పరీవాహక ప్రాంతాలు, ప్రధాన డ్యామ్ల పరిధిలో వరద ప్రభావ లెక్కలను గణిస్తున్న కేంద్ర జల వనరుల శాఖ.. రిజర్వాయర్ల వరద లెక్కలపై దృష్టి సారించింది. జలాల విపత్తు నిర్వహణ ప్రణాళిక (సీఎంపీ)లో భాగంగా దేశ వ్యాప్తంగా సమగ్ర జలాశయ విధానం (ఇంటిగ్రేటెడ్ రిజర్వాయర్ ఆపరేషన్) చేపట్టాలని నిర్ణయించిన జల వనరుల శాఖ.. రిజర్వాయర్ల వరదల లెక్కలను ఎప్పటికప్పుడు తమ ముందుంచాలని రాష్ట్రాలకు సూచించింది.
ఈ మేరకు గత నెలలో జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలుపుతూ అన్ని రాష్ట్రాలకు లేఖలు పంపింది. దేశంలోని గోదావరి, కృష్ణా, మహానది, గంగా, కావేరి, తాపీ, సువర్ణరేఖ వంటి ప్రధాన నదుల ఆధారంగా అనేక ప్రాజెక్టులు చేపట్టి, అనేక రిజర్వాయర్లు నిర్మించారు. వీటి వరద లెక్కలు పక్కాగా ఉండకపోవడంతో తీవ్ర నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలోని 74 ప్రధాన రిజర్వాయర్ల పరిధిలో సమగ్ర జలాశాయ విధానం తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా గుర్తించిన రిజర్వాయర్లకు వచ్చే వరద నీటి ప్రవాహాలను ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేయాలని కోరగా, తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. ఈ 74 రిజర్వాయర్లలో తెలంగాణకు సంబంధించి కడెం, ఎల్లంపల్లి ఉన్నట్లు తెలుస్తోంది.