ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై వేటు సబబే | Telangana High Court Dismisses Bhupathi Reddy Petition | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై వేటు సబబే

Jul 18 2019 7:03 AM | Updated on Jul 18 2019 7:03 AM

Telangana High Court Dismisses Bhupathi Reddy Petition - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరఫున ఎన్నికై, ఆ తరువాత కాంగ్రెస్‌ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై అనర్హత వేటు వేస్తూ శాసనమండలి చైర్మన్‌ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సమర్థించింది. మండలి చైర్మన్‌ జారీ చేసిన ఉత్తర్వుల్లో ఎటువంటి తప్పు లేదని తేల్చి చెప్పింది. ఈ ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధం కాదని స్పష్టం చేసింది. అలాగే అనర్హత వేటుకు ఆస్కారం కల్పిస్తున్న రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో ఉన్న 8వ పేరాను కూడా సమర్థించింది. మండలి చైర్మన్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ భూపతిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ల ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. మండలి చైర్మన్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ భూపతి రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. 10వ షెడ్యూల్‌లోని 8వ పేరా రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధమన్న భూపతిరెడ్డి వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్‌కు కల్పిస్తున్న ఈ పేరా రాజ్యాంగానికి లోబడే ఉందని తెలిపింది. మండలి చైర్మన్‌ రాజ్యాంగానికి లోబడే భూపతిరెడ్డిపై అనర్హత వేటు వేశారని, ఇందులో ఎటువంటి ఉల్లంఘన జరగలేదని వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement