తుమ్మల, ఆయన అనుచరులది.. వెన్ను పోటు రాజకీయం | swarna kumari gave complaint on tummala nageswara rao | Sakshi
Sakshi News home page

తుమ్మల, ఆయన అనుచరులది.. వెన్ను పోటు రాజకీయం

May 20 2014 2:18 AM | Updated on Sep 2 2017 7:34 AM

‘‘మా పార్టీలోని తుమ్మల నాగేశ్వరరావు, ఆయన వర్గీయులు నాపై కక్షగట్టి ఓడించారు.

కూసుమంచి, న్యూస్‌లైన్: ‘‘మా పార్టీలోని తుమ్మల నాగేశ్వరరావు, ఆయన వర్గీయులు నాపై కక్షగట్టి ఓడించారు. ఆడబిడ్డనని కూడా కనికరించలేదు’’ అని, టీడీపీ పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి, అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన మద్దినేని బేబి స్వర్ణకుమారి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ద్రోహం చేశారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. ఆమె సోమవారం కూసుమంచిలోని టీడీపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ... తాను ఉద్యోగం వదులుకుని టీడీపీలోకి వచ్చానని, గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో ఓడినప్పటికీ పార్టీలోనే ఉంటూ సేవ చేస్తున్నానని అన్నారు.

తన సేవలను పార్టీ అధినేత గుర్తించి, పాలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చారని అన్నారు. దీనిని పార్టీలోని కొందరు నాయకులు సహించలేకపోయారని, తనపై కక్షగట్టి ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నన్ను ఓడించేందుకని ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం మండలాల్లోని తుమ్మల వర్గీయులు కాంగ్రెస్‌కు ఓట్లు అమ్ముకున్నారు. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడుకు చెందిన పార్టీ నాయకుడు మద్ది మల్లారెడ్డి బహిరంగంగానే కాంగ్రెస్‌కు ఓట్లు వేయించాడు’’ అని ఆరోపించారు. టీడీపీ నాయకుడినని చెప్పుకునే అర్హత మల్లారెడ్డికి లేదన్నారు. తన ఓటమికి కారకులైన మల్లారెడ్డితోపాటు ఇతర నాయకులు పార్టీ కార్యకర్తలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘‘పార్టీకి నష్టం చేస్తే కన్నతల్లికి ద్రోహం చేసినట్టేనని తుమ్మ ల నాగేశ్వరరావు, ఆయన వర్గీయులు చెబుతున్నారు. వారు ఇప్పుడు చేసిందేమిటి..?’’ అని ప్రశ్నించారు.

 తుమ్మలది వెన్నుపోటు రాజకీయం..
 ‘‘తుమ్మల నాగేశ్వరరావుది  వెన్నుపోటు రాజకీయం. ఆయన గతంలో కొత్తగూడెంలో కోనేరు నాగేశ్వరరావును, ఖమ్మంలో బాలసాని లక్ష్మీనారాయణను, సుజాతనగర్‌లో పోట్ల నాగేశ్వరరావును. ఇప్పుడు ఇక్కడ నన్ను, ఎంపీగా  పోటీ చేసిన నామా నాగేశ్వరరావును ఓడించారు. ఆయన చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా..?’’ అని ధ్వజమెత్తారు. తాను ఓడిపోయినా పార్టీలోనే ఉంటానని అన్నారు. తనకు ఎన్నికల్లో సహకరించిన పాలేరు ఓటర్లకు, పార్టీ నాయకులు. కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో పార్టీ కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల అధ్యక్షులు మల్లీడు వెంకన్న,  బెల్లం వేణు, నాయకులు రామా శ్రీను, యానాల చినలింగారెడ్డి,వీరవెల్లి వెంకన్న, కొండపల్లి వెంకటేశ్వర్లు, బదావత్ వీరన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement