‘మిట్స్’లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం


చిలుకూరు : మండలంలోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి బుధవారం కాలేజీలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. బాధిత విద్యార్థి బంధువులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. మఠంపల్లి మండలం బక్కమంతులగూడెంకు చెందిన  కె.రామకృష్ణ మిట్స్ కళాశాలలో బీ ఫార్మసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.  పరీక్షలు రాయాలంటే 65శాతం హాజరు నమోదు కావాల్సి ఉండగా సదరు విద్యార్థికి  64.8 శాతం ఉంది. అయితే హాజరు శాతం తక్కువగా విద్యార్థులను బీఫార్మస్సీ హెచ్‌ఓడీ  కొన్ని రోజలుగా వేదిస్తున్నట్లుగా తెలిసింది. హాజరు శాతం తక్కువుగా ఉన్నదని ఫైనల్ పరీక్షలు రాయడానికి వీలు లేదని సంవత్సరం వృథా అవుతుందని  భయపెట్టడంతో రామకృష్ణ ఆందోళనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వారు ఆరోపించారు.

 

 అదనపు ఫీజు కోసం..

 రామకృష్ణకు హాజరు శాతం తక్కువుగా ఉండటంతో అదనంగా రూ. 10 వేలు చెల్లించాలని బీ ఫార్మసీ హెచ్‌ఓడీ వేదిస్తున్నట్లుగా   పలువురు విద్యార్థులు ఆరోపించారు. అంతేకాకుండా కళాశాలకు రాని రోజులకు ఒక్కో రోజుకు రూ. 500 చొప్పున అదనపు రుసుం వేశారని పేర్కొన్నారు.  దీంతో రామకృష్ణ నాలుగు రోజుల కళాశాలకు రాకపోవడంతో అతనికి అదనంగా రూ. 2వేలు ఫైన్ వేశారని తెలిపారు. మొత్తం  రూ. 12 వేలు తెస్తేనే కళాశాలకు రావాలని, లేకుంటే రావద్దనడమే కాకుండా ఈ ఏడాది ఫైనల్ పరీక్షలు, ప్రాక్టికల్స్‌కు అనుమతించబోమని చెప్పడంతో రామకృష్ణ మనస్థాపానికి గురయ్యాడు. ఈ విషయమై బుధవారం తప్పనిసరిగా డబ్బులు చెల్లించాల్సిందేనని మంగళవారం విద్యార్థికి హెచ్‌ఓడీ సీరియస్‌గా చెప్పినట్లు తెలిసింది. ఈ విషయాన్ని భయట ఎవరికైనా చెప్పినా మార్కులు తక్కువగాగా వేస్తామని , ప్రాక్టికల్స్‌లో ఫైయిల్ చేస్తామని కూడా బెదిరించినట్లుగా వారు ఆరోపించారు.

 

 అదనపు ఫీజు వసూలు చేయలేదు

 -నర్సిరెడ్డి, మిట్స్ కళాశాల ప్రిన్సిపాల్

 కళాశాలలో అదనపు ఫీజులు వసూలు చేయడం లేదు. విద్యార్థిని కూడా ఎలాంటి వేదింపులకు గురి చేయలేదు. అతని ఇంటి వద్ద ఉన్న సమస్యల వల్లే ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడగానే ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేసి బాధిత విద్యార్థిని కూడా వారికి అప్పడించాం.

 

 కళాశాలకు పురుగుల మందు డబ్బాతో...

 వేదింపులు తట్టుకోలేక రామకృష్ణ రోజు వారిగానే కళాశాలకు వచ్చేటప్పుడు పుస్తకాలతో పాటుగా పురుగుల మందు తీసుకొని వచ్చాడు. కళాశాల ప్రారంభం కాగానే కొద్ది సేపటికి పురుగుల మందు తాగడంతో తోటి విద్యార్థులు గమనించి చికిత్స నిమిత్తం హూజర్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. ఈ విషయాన్ని వెంటనే కళాశాల నిర్వాహకులు బాధితుని తల్లిదండ్రులకు తెలియజేశారు. ప్రస్తుతం విద్యార్థి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలిసింది.  

 

 మండిపడుతున్న విద్యార్థులు

 జరిగిన సంఘటన నేపథ్యంలో కళాశాల యాజమాన్యంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదనపు ఫీజులు వసూలు చేస్తున్నారని, ఎవరైనా చెల్లించకపోతే వేదించడమే కాకుండా బెదిరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించి కళాశాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top