చేప పిల్లల ఉత్పత్తి ప్రారంభం | Start of production of fish | Sakshi
Sakshi News home page

చేప పిల్లల ఉత్పత్తి ప్రారంభం

Aug 10 2014 2:37 AM | Updated on Sep 2 2017 11:38 AM

నాలుగు కోట్ల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా కడెoలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ముందుకుసాగుతోంది. ఈ కేంద్రాన్ని ప్రభుత్వం 1989లో ప్రారంభించింది.

కడెం : నాలుగు కోట్ల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా కడె ంలోని చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ముందుకుసాగుతోంది. ఈ కేంద్రాన్ని ప్రభుత్వం 1989లో ప్రారంభించింది. కడెం ప్రాజెక్టు సమీపంలోని దాదాపు 25 ఎకరాల స్థలంలో దీన్ని ఏర్పాటు చేశారు. చేప పిల్లలను ఉత్పత్తి చేసి కడెం రిజర్వాయర్లో వదిలి ఇక్కడి మత్స్యకారుల జీవనోపాధికి తోడ్పాటునందించాలనేది కేంద్రం ఉద్దేశం.

అయితే ఏటా చేప పిల్లల ఉత్పత్తికోసం లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశిస్తోంది. అందుకోసం సిబ్బంది ఆ దిశగా కృషి చేస్తున్నారు. పిల్లల ఉత్పత్తికి చల్లని వాతావరణం అనుకూలంగా ఉంది. ఉత్పత్తికి అవసరమైన హౌజులు 35 వరకు ఉన్నాయి. ఈ సారి వర్షాభావం కారణంగా ఉత్పత్తికి కొంత ఆటంకం కలుగుతోంది.

 ప్రారంభమైన ఉత్పత్తి
 జూలై రెండోవారంలో ఉత్పత్తి ప్రారంభించా రు. మొదటగా బంగారు తీగ, కట్ల,రహు రకం చేపల ఉత్పత్తి చేపట్టారు. తల్లి చేపకు కృత్రిమ గర్భదారణ చేయించిన అనంతరం మగ చేపలతో  ఫలదీకరణ చేయిస్తారు. ఇలా వచ్చిన చిన్న పిల్లలను 45 రోజుల వరకు హౌజులలో వాటికి అవసరమైన ఆహారం వేసి జాగ్రత్తగా పెంచుతారు. 45 రోజుల తర్వాత ఇంచు సైజులో పెరుగుతాయి. వాటిని కేంద్రం పరిధిలోని కడెం, ముథోల్, ఖానాపూరు, భైంసా, కుభీర్, తానూరు మండలాల్లోని గుర్తింపు పొందిన 45 మత్స్యకారుల సొసైటీలకు ప్రభుత్వం నిర్ణయించిన ధరకు విక్రయిస్తారు.

 కేంద్రంలో కట్ల చేప 13 లక్షలు, రహూ 20 లక్షలు, బంగారు తీగ 50 వేల వరకు పిల్లలున్నాయి. హౌజుల్లో వేసిన పిల్లలకు ఆహారాన్ని ప్రత్యేకంగా తయారు చేసి రోజూ అందిస్తారు. అధికారుల పర్యవేక్షణ ఎప్పటికప్పుడు కొనసాగుతుంది. కడెం ప్రాజెక్టు జలాశయంలోనూ పిల్లలను వదులుతారు. ప్రస్తుతం ఉత్పత్తి కేంద్రం పరిధిలో 51 చెరువులు,కుంటలున్నాయి. ఈసారి 4 కోట్ల పిల్లల ఉత్పత్తి లక్ష్యం ఉండడంతో ఇంకా కొద్దిరోజుల్లో మళ్లీ ఉత్పత్తి చేపడతామని అధికారులు చెబుతున్నారు. అంతేకాకుండా దోమల నివారణకోసం గంబూజియా చేపలు  కేంద్రంలో ప్రస్తుతం 5 లక్షల చేప పిల్లలున్నాయి. వాటిని ఆయా పంచాయతీలకు ఉచితంగా సరఫరా చేస్తారు.

 కేంద్రంలో సిబ్బంది కొరత
 ఉత్పత్తి కేంద్రంలో సిబ్బంది పూర్తి స్థాయిలో లేరు. నాలుగైదు ఏళ్లుగా కేంద్రానికి ఇన్‌చార్జి అధికారే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కేంద్రం చుట్టూ కంచె లేదు. పశువులు విచ్చలవిడిగా సంచరిస్తుంటాయి. రాత్రి వేళల్లో అంధకారం.
 

Advertisement
 
Advertisement
Advertisement