కిసాన్నగర్ వరకే ‘కాళేశ్వరం’ నీరు
నిలిచిన వెట్రన్..
సాక్షి, బాల్కొండ: ఎస్సారెస్పీ పునరుజ్జీవన పథకంలో భాగంగా శనివారం ప్రారంభించిన వెట్రన్ నిలిచిపోయింది. దీంతో వరద కాలువలో నీరు బాల్కొండ మండలం కిసాన్నగర్ వరకు మాత్రమే వచ్చి నిలిచి పోయింది. వరద కాలువపై రాజేశ్వర్రావుపేట్ వద్ద నిర్మించిన రెండో పంపుహౌస్ నుంచి రెండు మోటార్ల ద్వారా వెట్రన్ నిర్వహించారు. శనివారం కిసాన్నగర్ వరకు చేరుకోగానే మోటార్లు నిలిపి వేయడంతో నీరు అక్కడికే నిలిచి పోయింది.
ఎస్సారెస్పీకి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో కాళేశ్వరం నీళ్లు ఆగాయి. మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం ఇక్కడికి రావాల్సి ఉంది. అయితే, మంత్రివర్గ విస్తరణ ఉండటంతో పర్యటన వాయిదా పడటంతో మోటార్ల ద్వారా వెట్రన్ నిలిపి వేసినట్లు తెలిసింది. దీంతో కిసాన్నగర్ వరకు మాత్రమే కాళేశ్వరం నీళ్లు వచ్చి చేరాయి. త్వరలోనే ఎస్సారెస్పీకి కాళేశ్వరం నీళ్లు చేర వేసే కార్యక్రమం ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు.