జోరుగా దొంగనోట్ల చెలామణి | Small business owners lost badly due to fake notes | Sakshi
Sakshi News home page

జోరుగా దొంగనోట్ల చెలామణి

Nov 24 2014 3:23 AM | Updated on Sep 2 2017 4:59 PM

భద్రాచలంలో దొంగనోట్లు జోరుగా చెలామణి అవుతున్నాయి. దొంగనోట్ల కారణంగా చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు.

భద్రాచలం : భద్రాచలంలో దొంగనోట్లు జోరుగా చెలామణి అవుతున్నాయి. దొంగనోట్ల కారణంగా చిరువ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. పట్టణంలోని పాత మార్కెట్ సెంటర్‌లో గల కూరగాయల దుకాణాల నిర్వహించే వారికి కొంతమంది దొంగనోట్లను అంటగట్టారు. రెండు రోజులుగా ఇదే తంతు జరుగుతుండటంతో వారు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజంతా కూరగాయలు అమ్మితే రూ.200ల వరకూ ఆదాయం వస్తుందని, కానీ దొంగనోట్ల వల్ల దీన్ని పోగొట్టుకుంటున్నామని వెంకటమ్మ అనే కూరగాయల వ్యాపారి తెలిపింది.

రూ.100 నోటు వస్తే తీసుకొని కూరగాయలు ఇవ్వటంతో పాటు, తిరిగి చిల్లర కూడా ఇచ్చానని చెప్పింది.  తీరా సాయంత్రం వ్యాపారికి డబ్బులు కట్టే సమయంలో అది దొంగనోటు అని తెలియటంతో ఆ చిరు వ్యాపారి గుండెలు గుబేలు మన్నాయి. రోజంతా మండుటెండులో కూర్చుని అమ్మిన ఆదాయం పోయిందిన ఆవేదన వ్యక్తం చేసింది. మార్కెట్ సెంటర్‌లో ఇటీవల కాలంలో ఏదో ఒకచోట ఇలా దొంగనోట్లు బయట పడుతున్నాయి.

ఇందులో మార్కెట్ ఏరియాలో ఉన్న కొంతమంది ప్రముఖ వ్యాపారుల పాత్ర కూడా ఉందనే అనుమానాలు ఉన్నాయి.  ఇటీవలనే దొంగనోట్ల ముఠాను భద్రాచలం పోలీసులు పట్టుకున్నారు. కానీ దొంగనోట్ల చెలామణి మాత్రం ఆగకపోవటంతో పట్టణ వాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు దీనిపై నిఘా ఏర్పాటు చేయాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement