నిరసన ఉద్రిక్తం
చార్మినార్ ఆయుర్వేద ఆస్పత్రి తరలింపుపై వ్యతిరేకత
ఆందోళనలు ఉధృతం ఎర్రగడ్డలోని ఆస్పత్రి ఓపీకి తాళం
ఇబ్బందులు ఎదుర్కొన్న రోగులు
వైద్య విద్యార్థులపై ఆగ్రహం పోలీసుల రంగప్రవేశం
సాక్షి, సిటీబ్యూరో/వెంగల్రావునగర్: చారిత్రక చార్మినార్లోని ఆయుర్వేద ఆస్పత్రిని ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలకు తరలింపుపై నెలకొన్న వివాదం రోజురోజుకు ముదురుతోంది. ఆయుర్వేద వైద్య కళాశాలకు చెందిన విద్యార్థులు.. కాలేజీకి అనుబంధంగా కొనసాగుతున్న ఆస్పత్రి ఓపీ విభాగానికి తాళం వేసి రెండు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. దీంతో వివిధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ చికిత్స నిమిత్తం దూర ప్రాంతాల నుంచి సోమవారం ఆస్పత్రికి వచ్చిన బాధితులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోపలికి అనుమతించాలని రోగులు వేడుకున్నా ఆందోళనకారులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో వైద్య విద్యార్థులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులు, బాధితులను శాంతింపజేశారు.
ఇదీ వివాదం...
1958లో 60 పడకల సామర్థ్యంతో చార్మినార్ ఆయుర్వేద ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 100 పడకలకు పెంచినప్పటికీ.. స్థలాభావంతో 75 పడకతోనే కొనసాగుతోంది. ఆస్పత్రి ఔట్పేషెంట్ విభాగానికి గ్రేటర్ నుంచే కాకుండా శివారులోని మహబూబ్నగర్, నల్లగొండ, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ తదితర జిల్లాల నుంచి రోజుకు సగటున 200 మంది రోగులు వస్తుంటారు. వీరిలో 40 నుంచి 50 మంది వరకు ఇన్పేషెంట్లుగా అడ్మిట్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ భవనం శిథిలావస్థకు చేరుకుంది. 2014లో భవనాన్ని ఖాళీ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించగా... వైద్యుల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గింది. మరమ్మతుల పేరుతో ఇటీవల ఈ భవనాన్ని ఖాళీ చేయాలని భావించింది. ఇప్పటికే ఆయా వార్డులను ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం 10 పడకలతో కేవలం ఓపీ సేవలు అందిస్తున్నారు. అయితే ఆయుర్వేద ఆస్పత్రిని ఉద్దేశపూర్వకంగానే తరలిస్తున్నారని... ఈ నిర్ణయంతో ఉద్యోగులు, పాతబస్తీ ప్రజలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని వైద్యులు, వైద్య విద్యార్థులు పేర్కొంటున్నారు. తరలింపును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆయుర్వేద వైద్య విద్యార్థులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం విదితమే. తాజాగా తమ ఆందోళనలను ఉధృతం చేశారు. ఎర్రగడ్డలోని ఆయుర్వేద కళాశాలకు అనుబంధంగా కొనసాగుతున్న ఆస్పత్రి ఔట్పేషెంట్ విభాగానికి తాళం వేసి రెండు రోజులుగా నిరసన తెలుపుతున్నారు. ఓపీ సేవలు బంద్ చేయడంతో చికిత్స నిమిత్తం వచ్చిన రోగులు నిరాశేతో వెనుదిరగాల్సి వస్తోంది.
రోగుల ఆగ్రహం..
ఆస్పత్రికి తాళం వేసి ఉండడంతో అటు వైద్యులు, ఇటు రోగులు ఆందోళనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు రోగులు, వైద్యులు, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నిసార్లు బతిమిలాడినా విద్యార్థులు వినిపించుకోలేదు. దీంతో రోగులు వైద్య విద్యార్థులతో వాగ్వివాదానికి దిగారు. కొందరు వెనక ద్వారం నుంచి లోపలికెళ్లి ఓపీ చీటీ రాయించుకునేందుకు ప్రయత్నించగా అక్కడ సైతం అడ్డుకున్నారు. ఆందోళనకారులకు బీజేపీ మద్దతు ప్రకటించింది. ఆ పార్టీ నగర ప్రధాన కార్యదర్శి అట్లూరి రామకృష్ణ తదితరులు ఆసుపత్రికి వచ్చి విద్యార్థులు చేస్తున్న ఆందోళనకు మద్దతు పలికారు. చార్మినార్ ఆయుర్వేద ఆసుపత్రిని తరలించడానికి వీల్లేదని.. అలా చేస్తే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
నిరాశే
కొన్ని రోజుల క్రితం టైఫాయిడ్ జ్వరం వచ్చింది. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా జ్వరం తగ్గినప్పటికీ... కీళ్ల నొప్పులు మొదలయ్యాయి. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. ఇక్కడ నయం చేస్తారని తెలిసి ఒడిశా నుంచి వచ్చాను. అయితే ఆస్పత్రికి తాళాలు వేసి తర్వాత రమ్మని అంటున్నారు. లోపలికి పంపించాలని వేడుకున్నా వినలేదు. ఎంతో ఆశతో నిరాశే మిగిలింది. – పి.మేఘన, ఒడిశా