‘చదువులు చారెడు బుక్స్‌ బారెడు’ | Private Schools Are Not Following Government Terms In Mahabubnagar | Sakshi
Sakshi News home page

‘చదువులు చారెడు బుక్స్‌ బారెడు’

Jul 31 2019 10:51 AM | Updated on Jul 31 2019 10:51 AM

Private Schools Are Not Following Government Terms In Mahabubnagar - Sakshi

నేహాంత్‌ తండ్రి ఓ ప్రభుత్వ ఉద్యోగి. తన కుమారుడిని గొప్ప వాడిగా తీర్చిదిద్దాలన్న ఉద్దేశ్యంతో ఓ కార్పొరేట్‌ పాఠశాలలో చేర్పించాడు. కానీ తన కొడుక్కి మోయలేని పుస్తకాల భారాన్ని చూసి చలించిపోతున్నాడు. ఆరో తరగతి చదువుతున్న నేహంత్‌ ప్రతి రోజు కేజీల కొద్ది పుస్తకాలను మోయడం వల్ల భవిష్యత్తులో తన ఎదుగుదలపై ఎంత ప్రభావం చూపుతుందో అని ఆ తండ్రి భయపడి పోతున్నాడు.   ఈ  సమస్య ఒక్క నేహాంత్‌దే కాదు. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి ఎదుర్కొంటున్న  సమస్య.   ప్రభుత్వ   నిబంధనలను చాలా  పాఠశాలల  యాజమాన్యాలు   పట్టించుకోకపోవడమే దీనికి కారణం.

సాక్షి, మహబుబ్‌నగర్‌ : ప్రభుత్వం చిన్నారులకు ఎక్కువ సంఖ్యలో బరువైన పుస్తకాలను మోయకుండా ఉంచేందుకు తరగతుల వారీగా బరువులను నిర్ణయించింది. కానీ వాటిని యాజమాన్యాలు పెద్దగా పట్టించుకోకుండా ఇష్టరీతిగా పిల్లలతో పుస్తకాలను మోయిస్తున్నారు. దీంతో విద్యార్థులు శారీరక బరువుతో ఇబ్బందులు పడుతుండగా, భవిష్యత్తు వారి ఎత్తు పెరుగుదల వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. బడి బ్యాగు మోయలేక చిన్నారులు నీరసించి పోతున్నారు. బాధను చెప్పుకోలేక మానసికంగా కుంగిపోతున్నారు. ‘చదువులు చారెడు బుక్స్‌ బారెడు’ అన్న చందంగా మారింది ప్రవేటు పాఠశాలల తీరు.

నర్సరీ, ఎల్‌కేజీ నుంచి బాల్యంలో బండెడు బరువు మోస్తూ ఆపసోపాలు పడుతున్నారు విద్యార్థులు, తల్లిదండ్రులు వారిని పాఠశాలకు పంపామని సంబురపడుతున్నారే తప్ప వారు మోస్తున్న పుస్తకాల బరువు ఎంత... అంత బరువును చిన్నారులు మోయడం వల్ల వచ్చే సమస్యలు, వారు పడుతున్న బాధను పట్టించుకోవడంలేదు. ఎన్ని పుస్తకాలు బ్యాగ్‌లో ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా చదువుతున్నారనే దోరణిలో ఉంటున్నారు. 

మార్గదర్శకాలు పట్టవా..?
ప్రభుత్వ, ప్రైవేటు బడుల్లో చదువుతున్న విద్యార్థులు ఎంతబరువుల పుస్తకాలు మోయాలన్న విషయంలో స్పష్టంగా వివరిస్తూ గత విద్యాసంవత్సరంలో మార్గదర్శకాలు జారీ చేసింది. ఇందులో 1, 2వ  తరగతి విద్యార్థులకు 1.5 కేజీల బరువు, 3, 5 తరగతులకు  2 నుండి 3 కేజీలు, 6, 7 తరగతులకు  చదువుతున్న విద్యార్థులు కేవలం 4 కేజీలు, 8,9 తరగతుల వారికి 4.50 కేజీలు, పదవ తరగతి విద్యార్థులకు కేవలం 5 కేజీల పుస్తకాలను మాత్రమే కేజీల పుస్తకాలను మాత్రమే మోయాలని పేర్కొంది. కానీ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది.

ఒక్కో విద్యార్థి 8కేజీల నుండి 10 కేజీలకు పైగానే బరువును మోస్తున్నట్లు తెలుస్తుంది. ఈ బరువు ప్రభుత్వ బడుల్లో తక్కువగానే ఉన్నప్పటికీ ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం చాలా ఎక్కువగానే ఉంది.  ఇందుకు సంబంధించి పుస్తకాలపై విద్యాశాఖ అధికారుల పర్యావేక్షణ కూడా ఉండాల్సి ఉంది. కానీ తమకేమీ పట్టనట్లు వ్యవహరిçస్తుండడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. 

ఇష్టారీతిగా పుస్తకాల మోతలు
ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రభుత్వం సూచించిన పుస్తకాలను మాత్రమే వినియోగించాల్సి ఉంది. ఇందులో స్టేట్‌ సిలబస్, సెంట్రల్‌ సిలబస్‌కు సంబంధించినవి మాత్రమే వినియోగించాల్సి ఉంది. కానీ ప్రైవేటు పాఠశాలలు అడ్డగోలుగా పుస్తకాలను వినియోగిస్తున్నారు. అయితే సబ్జెక్టుల వారిగా స్టేట్, సెంట్రల్‌ సిలబస్‌కు సంబంధించినవి కాకుండా ఇతర పుస్తకాలను కూడా విద్యార్థులతో చదివిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఐఐటీ, నీట్, ఇంజనీరింగ్,  అంటూ చదివే సబ్జెక్టులకు అధనంగా ఈ పుస్తకాలను విద్యార్థులతో చదివిస్తున్నారు.

అంతేకాకుండా హోంవర్క్, ప్రాజెక్టులు, ప్రాక్టీస్, గైడ్లు, టెస్టు పేపర్లు అంటూ అదనపు బరువు పడుతుంది. సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్సు వంటి సబ్జెక్టులకు సంబందించి ఒక్కో పాఠశాల ఒక్కో మెటీరియల్‌ను అనుసరిస్తూ విద్యార్థుల చదువులను గందరగోళంలో పడేస్తున్నారు. అనేక పుస్తకాలను విద్యార్థులకు అధనంగా చేరడంతో బరువులు అమాంతం పెరిగిపోతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement