ఇది.. ఆ దగ్గేనా?

People Rushing To Hospital For Coronavirus Test In Hyderabad - Sakshi

కొంచెం జలుబు చేసినా వణికిపోతున్న జనం

కోవిడ్‌ టెస్టుల కోసం ప్రైవేటు ల్యాబ్‌లకు క్యూ

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలకు ప్రైవేటు ల్యాబ్‌లకు అనుమతి రావడంతో అనుమానితుల తాకిడి పెరిగింది. వైద్యుల ధ్రువీకరణతో ఈ పరీక్షలు చేయాల్సి ఉండగా.. కాస్త లక్షణాలు కనిపించిన వారు కూడా పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ప్రభుత్వ ల్యాబ్‌లో నిర్దేశించిన లక్షణాలున్న వారికి మాత్రమే పరీక్షలు నిర్వహిస్తున్నారు. లక్షణాలు లేని వాళ్లను తిరస్కరిస్తుండటంతో ప్రైవేటు ల్యాబ్‌ల వైపు పరుగులు పెడుతున్నారు. కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్ష ఫీజును ప్రభుత్వం రూ.2,200గా నిర్ణయించింది. అయితే ఇంటి వద్దకు వచ్చి శాంపిల్‌ సేకరించే ప్రైవేటు ల్యాబ్‌కు పరీక్ష ఫీజును రూ.2,800గా స్వీకరించే వెసులుబాటు కల్పించింది.(ఈ మాస్క్‌ ఉంటే చాలు.. వైరస్‌ ఖతం)

వాతావరణ మార్పులతోనే.. 
కరోనా వైరస్‌ పరీక్షల నిర్ధారణకు తీవ్రమైన దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, తెమడ, వాసన, రుచి గుర్తించే గుణాల్ని కోల్పోవడం లాంటి లక్షణాలుండాలి. కానీ ప్రస్తుతం ప్రైవేటు ల్యాబ్‌లు ఈ లక్షణాల్లో కొన్ని ఉన్నా.. కొన్ని సందర్భాల్లో లేకున్నా పరీక్షలు చేస్తున్నా యి. వాతావరణంలో వస్తున్న మార్పులతో శరీరంలో మార్పులు జరుగుతాయి. ఈ క్రమంలో జలుబు, దగ్గు రావడం సహజమే. కానీ ఈ లక్షణాలను కరోనాకు సంబంధించినవిగా పరిగణిస్తున్నారు. ప్రభుత్వం కరోనా మార్గదర్శకాలు విడుదల చేసినా కొందరు కరోనా పరీక్షలు చేయించుకునేందుకు మొగ్గు చూపుతుండగా.. ప్రైవేటు ల్యాబ్‌లు దీన్ని సొమ్ము చేసుకుంటున్నాయి.(మళ్లీ  లాక్‌డౌన్‌ ఉండదు)

సాధారణంగా ప్రభుత్వ ల్యాబ్‌లో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌గా రిజల్ట్‌ వస్తే వెంటనే వైద్య శాఖ యంత్రాంగం అప్రమత్తమవుతుంది. కానీ, మంగళవారం ఓ డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో కరోనా పరీక్ష నిర్వహించుకున్న ఓ అమ్మాయికి పాజిటివ్‌గా తేలింది. వైద్య శాఖ అధికారులు, స్థానిక ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్త నుంచి ఫోన్‌ రాకపోవడంతో సదరు ల్యాబ్‌ నిర్వాహకులు ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారా? లేదా అనే సందేహం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ల్యాబ్‌ల్లో పరీక్షల వేగం పెరిగింది. క్షేత్రస్థాయిలో పరీక్షల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. 10 రోజుల్లో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధితో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 50 వేల పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. అలాగే ఇతర ప్రభుత్వ ల్యాబ్‌ల్లో, మెడికల్‌ కాలేజీల్లోనూ పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు వేగవంతం చేశారు. దీంతో ప్రభుత్వ ల్యాబ్‌ల్లో పరీక్షల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top