చల్లటి కబురు.. కేరళకు నైరుతి | Monsoon arrival to the state on 7th | Sakshi
Sakshi News home page

చల్లటి కబురు.. కేరళకు నైరుతి

May 30 2018 2:03 AM | Updated on May 30 2018 4:34 AM

Monsoon arrival to the state on 7th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నైరుతి రుతుపవనాలు మంగళవారం కేరళను తాకాయి. నిర్ణీత సమయం కన్నా మూడు రోజులు ముందుగానే కేరళను చేరాయి. సాధారణంగా జూన్‌ ఒకటో తేదీన రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. గతేడాది మే నెల 30వ తేదీన ప్రవేశించగా, ఈసారి 29నే వచ్చాయి.

అనుకున్న తేదీ కన్నా ముందుగానే రుతుపవనాలు దేశంలోకి రావడం వరుసగా ఇది రెండో ఏడాది. ఇక ముందుగా అనుకున్నట్లుగానే జూన్‌ ఏడో తేదీన తెలంగాణలోకి నైరుతి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. మరోవైపు రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు నెలన్నర సమయం పట్టే అవకాశం ఉంది. జూలై 15 నాటికి రాజస్తాన్‌లోని శ్రీ గంగానగర్‌కు నైరుతి విస్తరించనుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

నేడు, రేపు భారీ ఎండలు
రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించేంత వరకు ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతాయని.. బుధ, గురువారాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వై.కె.రెడ్డి తెలిపారు. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా వెళ్తుండటంతో దాని ప్రభావంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని విశ్లేషించారు.

ఆ ప్రభావంతోనే మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 45 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండ, రామగుండం, మెదక్, ఖమ్మంలలో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో ఈ సీజన్‌లో మే రెండో తేదీన 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, మంగళవారం కూడా అదే స్థాయిలో నమోదైంది. దీంతో ఎండల తీవ్రత రాష్ట్ర ప్రజలు విలవిల్లాడారు.  

97 శాతం వర్షాలు
ఈసారి 97 శాతం వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో సాధారణ నైరుతి సీజన్‌ వర్షపాతం 755 మిల్లీమీటర్లు (ఎం ఎం) కాగా, 97 శాతం లెక్కన ఈసారి 732 ఎంఎంలు కురిసే అవకాశముంది. గతేడాది ఇదే సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపినా 87 శాతమే కురిసింది.

13 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 2016లో సాధారణం కంటే 19 శాతం అధిక వర్షపాతం తెలంగాణ లో నమోదైంది. ‘‘రుతుపవనాలు ప్రవేశించాక ఒక్కో సారి రాష్ట్రమంతటా విస్తరిస్తాయి. కొన్నిసార్లు విస్తరించడానికి నాలుగైదు రోజులు పడుతుంది. గతేడాది ఒకేసారి విస్తరించాయి’’ అని వై.కె.రెడ్డి తెలిపారు.

వర్షాలు మొదలు..
రుతుపవనాల రాక నేపథ్యంలో కేరళలో వర్షాలు మొదలయ్యాయి. కర్ణాటక, కేరళ, లక్షద్వీపాలు, అండమాన్‌ నికోబార్‌ దీవులు, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురల్లో పలు చోట్ల మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement