మరో 3 ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీలు | Medical Health Department has decided to three new government nursing colleges. | Sakshi
Sakshi News home page

మరో 3 ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీలు

Jun 15 2017 1:53 AM | Updated on Oct 9 2018 7:11 PM

రాష్ట్రంలో కొత్తగా మరో మూడు ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీలను నెలకొల్పాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.

► మహబూబ్‌నగర్, సిద్దిపేట, నిజామాబాద్‌లలో ఏర్పాటు
► కొత్తగా నెలకొల్పాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా మరో మూడు ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీలను నెలకొల్పాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. మహబూబ్‌నగర్, సిద్దిపేట, నిజామాబాద్‌లలో ఈ మూడు కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కాలేజీలో 50 బీఎస్సీ నర్సింగ్‌ సీట్లు ఉండేలా ప్రతిపాదనలు తయారు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐదు బీఎస్సీ నర్సింగ్‌ కాలేజీలున్నాయి. వాటిల్లో మొత్తం 280 సీట్లున్నాయి.

ఉస్మానియాలో ఎంఎస్సీ నర్సింగ్‌ ఉంది. అందులో 30 సీట్లున్నాయి. ఇవి కాకుండా ప్రైవేటు ఆధ్వర్యంలో 9 ఎంఎస్సీ నర్సింగ్‌ కాలేజీలు, 60 ప్రైవేటు కాలేజీలున్నాయి. అవి కాకుండా జనరల్‌ నర్సింగ్‌ మిడ్‌వైఫరీ (జీఎన్‌ఎం) ప్రభుత్వ కాలేజీలు 6,126 ప్రైవేటు కాలేజీలున్నాయి. అలాగే మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్స్‌ (ఎంపీహెచ్‌ఎస్‌) కోర్సుకు సంబంధించి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఐదు కాలేజీలు, 113 ప్రైవేటు కాలేజీలున్నాయి.

అధ్యాపకుల్లేక కుప్పకూలిన నర్సింగ్‌ విద్య
దాదాపు 15 కార్పొరేట్‌ నర్సింగ్‌ కాలేజీలను మినహాయిస్తే మిగిలిన చోట్ల నర్సింగ్‌ విద్య కుప్పకూలింది. అర్హులైన అధ్యాపకుల్లేకపోవడంతో కాలేజీల్లో ప్రమాణాలు పడిపోతున్నాయి. దీంతో వైద్య రంగమే ప్రమాదంలో పడుతోంది. భారత నర్సింగ్‌ మండలి (ఐఎన్‌సీ) నిబంధనల ప్రకారం 40 నుంచి 60 సీట్లు ఉంటే ఇద్దరు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, మరో ఇద్దరు అసిస్టెంటు ప్రొఫెసర్లు ఉండాలి. అలాగే 13 నుంచి 18 మంది ట్యూటర్లు ఉండాలి. అయితే చాలా కాలేజీల్లో క్లినికల్‌ సైడ్‌లో ఉన్న వారితో నడిపించేస్తున్నారు.

ఇక ప్రభుత్వ నర్సింగ్‌ కాలేజీల్లో వందల్లో సీట్లు ఉంటే.. ప్రైవేటు కాలేజీల్లో వేలాది సీట్లు ఉన్నాయి. ఎలాంటి నిబంధనలు పాటించకుండానే ఐఎన్‌సీ ఇష్టారాజ్యంగా నర్సింగ్‌ కాలేజీలకు అనుమతి ఇచ్చిందన్న విమర్శలున్నాయి. దాదాపు 90 శాతం నర్సింగ్‌ కాలేజీలకు అధ్యాపకులే లేరు. వాటికి సరిపడా బిల్డింగ్‌లు, తరగతి గదులు కూడా లేవు. అంతేకాకుండా విద్యార్థుల నుంచి డబ్బులు తీసుకొని పరీక్షలు రాయిస్తారన్న విమర్శలున్నాయి. దీంతో నర్సింగ్‌ విద్యపై త్వరలో వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డి సమీక్ష నిర్వహిస్తారని అధికార వర్గాలు తెలిపాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement