
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పచ్చి అబద్ధాలకోరు అని, ఆయన చెప్పే మాటల్లో చిత్తశుద్ధి, నిజాయితీ ఉండదని, అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన మాదిగలపై మొసలికన్నీరు కార్చడమేనని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పున రుద్ఘాటించారు. సోమవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ‘ఎస్సీ వర్గీకరణ కోరుతూ కేసీఆర్ ప్రధానికి లేఖ రాయడానికి రెండు రోజుల సమయం అడిగి ఇప్పటికీ రాయలేదు’ అని విమర్శించారు.
ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరుతూ సీఎం ఫిబ్రవరి 6న లేఖ రాయగా ఉత్తర్ప్రదేశ్ ఎన్నికలుండడంతో ప్రధానమంత్రి కార్యాలయం అపాయింట్మెంట్ తిరస్కరించిందని, నాటి నుంచి నేటి వరకు సీఎం ప్రధానికి లేఖ రాయలేదని అన్నారు. ఎమ్మార్పీఎస్ కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చిన సందర్భంగా అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెడితే ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. ఈ మూడు సంఘటనలు వర్గీకరణ అంశంపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ,నిజాయితీ లేదనడానికి నిదర్శనాలని పేర్కొన్నారు. దేశంలో ఏ త్యాగానికి దక్కనంత గౌరవం దక్కేలా భారతి సంస్మరణ సభ ఈ నెల 20వ తేదీన నిర్వహిస్తామని చెప్పారు.