
లోకేష్ నాయకత్వం మమ్మల్ని అవమానించటమే
తెలంగాణ ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్కు మద్దతు తెలుపుతున్నామని సైకిల్ దిగి కారెక్కిన టీడీపీ ఎమ్మెల్యేలు తెలిపారు.
హైదరాబాద్ : తెలంగాణ ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతోనే కేసీఆర్కు మద్దతు తెలుపుతున్నామని సైకిల్ దిగి కారెక్కిన టీడీపీ ఎమ్మెల్యేలు తెలిపారు. బంగారు తెలంగాణ కోసమే టీఆర్ఎస్లో చేరామని మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణలో టీడీపీ నాయకులే లేనట్లు లోకేష్కు బాధ్యతలు అప్పగిస్తామనటం తమని అవమానించడమేనని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణలో కరెంటు కష్టాలకు చంద్రబాబు నాయుడే కారణమని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సమావేశాల పేరుతో టీఆర్ఎస్పై విమర్శలు చేయాలని తమపై చంద్రబాబు ఒత్తిడి తెస్తున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకే బస్సు యాత్రలు చేయమన్నారని తలసాని విమర్శించారు. తెలంగాణ బిడ్డలుగా ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉండాలనుకుంటున్నామన్నారు. మరిన్ని విషయాలు బహిరంగ సభలో ప్రజల ముందు ఉంచుతామని ఆయన తెలిపారు. అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరినట్లు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు.