పరిహారం సత్వరం

KCR Hold Review Meet Over Mallanna Sagar Oustees - Sakshi

‘మల్లన్నసాగర్‌’ నిర్వాసితులకు సాయంపై అధికారులకు సీఎం ఆదేశం

ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించాలని సీఎస్‌కు సూచన

క్షేత్రస్థాయిలో అమలు బాధ్యత సీఎంఓ కార్యదర్శికి అప్పగింత

‘పరిహారం’లో కోర్టు జోక్యం చేసుకునే పరిస్థితులు రావడంపై అసహనం

పరిహారం, పునరావాసానికే రూ. 800 కోట్లు ఖర్చు చేస్తున్నామని వెల్లడి

చెల్లింపులో జాప్యాన్ని కొందరు అలుసుగా తీసుకుంటున్నారని వ్యాఖ్య

ప్రాజెక్టునే ఆపడానికి కుట్రలు చేస్తున్నారని మండిపాటు

ఆరేడు నెలల్లో ప్రాజెక్టు పూర్తికి ఆదేశం

సీఎం ఆదేశాలతో పరిహార పంపిణీ కోసం ప్రత్యేకాధికారుల నియామకం 

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ కోసం సేకరించిన భూముల నిర్వాసితులకు ఉపాధి, పునరావాస సాయం పంపిణీని వంద శాతం యుద్ధప్రాతిపదికన పూర్తి చేయా లని సీఎం కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పరిహారం చెల్లింపు చాలావరకు పూర్తయిందని, మిగిలిన ప్రక్రియను కొద్దిరోజుల్లోనే పూర్తిచేసి ఈ నెల 11లోగా హైకోర్టుకు నివేదిక పంపాలని సూచించారు. పరిహారం చెల్లింపుపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ శుక్రవారం ఉన్నతాధికారులతో మాట్లాడారు. నిర్వాసితులను అన్ని విధాలా ఆదుకునే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో, అత్యంత మానవత్వంతో వ్యవహరిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అయినా కోర్టులు తరచూ జోక్యం చేసుకునే పరిస్థితులు రావ డంపట్ల సీఎం తీవ్ర అసహ నం వ్యక్తం చేశారు. నిర్వాసి తులకు పరిహారం అం దించే ప్రక్రియను వెంటనే ముగించేలా స్వయంగా పర్యవేక్షించాలని సీఎస్‌ ఎస్‌.కె.జోషికి సూచించారు. అలాగే పరిహారం పంపిణీని క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యతను సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌కు సీఎం అప్పగించారు. మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితులకు పరిహారం పంపిణీని చేపట్టేందుకు గ్రామాలవారీగా శిబిరాలు నిర్వహించాలని, ప్రత్యేక అధికారులను నియమించాలని ఆదేశించారు. 


మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌

పరిహారానికి 800 కోట్లు ఖర్చు.. 
భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు విషయమై అధికారులకు సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ‘‘లక్ష కోట్ల రూపాయల వ్యయంతో తెలంగాణలో 40 లక్షలకుపైగా ఎకరాలకు సాగునీరు అందించేందుకు అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నాం. అందులో భాగంగా 50 టీఎంసీల సామర్థ్యంతో మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మిస్తున్నాం. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు మల్లన్నసాగర్‌ గుండె లాంటిది. ఇంత పెద్ద రిజర్వాయర్‌ నిర్మించే క్రమంలో కొద్ది మంది భూములు, ఇళ్లు కోల్పోతున్నారు. వారి విషయంలో ప్రభుత్వం ఎంతో సానుభూతితో, మానవత్వంతో వ్యవహరిస్తోంది. నిర్వాసితులు మెరుగైన పునరోపాధి, పునరావాసం పొందడానికి ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచే ప్యాకేజీని అందిస్తోంది. రూ. 800 కోట్లను మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు పరిహారం, పునరావాస కార్యక్రమాల కోసమే ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం ఇంత చేసినా, కొద్ది మందికి సాయం అందించే విషయంలో జరిగిన జాప్యం వల్ల కోర్టులు తరచూ జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. ఇది అత్యంత బాధాకరం. ఏనుగు ఎల్లింది, తోక మిగిలింది అనే చందంగా మొత్తం ప్రక్రియలో కొద్దిపాటి పరిహారం ఇవ్వడమే మిగిలింది. దీన్ని అలుసుగా తీసుకొని కొంత మంది వ్యక్తులు, ప్రగతి నిరోధక శక్తులు ప్రాజెక్టునే ఆపడానికి కుట్రలు చేస్తున్నారు. పరిహారం పంపిణీ ప్రక్రియలో మిగిలిన కొంచెం పనిని కూడా త్వరగా పూర్తి చేసి, చిల్లర పంచాయితీని వెంటనే ముగించాలి. పరిహారం పంపిణీని యుద్ధప్రాతిపదికన ముగించి కొండపోచమ్మ సాగర్‌ రిజర్వాయర్‌ మాదిరిగానే శరవేగంగా మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణ పనులు చేపట్టాలి. యుద్ధం జరుగుతుందా అన్నట్లుగా పనులు చేసి, ఆరేడు నెలల్లోనే మల్లన్నసాగర్‌ నిర్మాణం పూర్తి చేయాలి. వచ్చే ఏడాది జూన్‌లో రిజర్వాయర్‌లో నీళ్లు నింపాలి’’అని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. 

సీఎం ఆదేశాలతో కదిలిన అధికార గణం... 
మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు పరిహారం చెల్లింపు కార్యక్రమాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించడంతో అధికార యంత్రాగం కదిలింది. నీటిపారుదల శాఖను కూడా నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి తన అమెరికా పర్యటనను రద్దు చేసుకొని ఉన్నతాధికారులతో సమీక్షించారు. పరిహారం పంపిణీ ప్రక్రియను ముగించడానికి ప్రణాళిక రూపొందించారు. సిద్దిపేట కలెక్టర్‌ కృష్ణ భాస్కర్, సిద్దిపేటలో గతంలో విధులు నిర్వహించిన సిరిసిల్ల కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డితో సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్‌ సమావేశమయ్యారు. ఇప్పటివరకు అందిన పరిహారం వివరాలు తెలుసుకొని మిగిలి వారికి పరిహారం అందించే కార్యక్రమాన్ని ఖరారు చేశారు. మల్లన్నసాగర్‌ పరిధిలోని 8 గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి నిర్వాసితులకు పరిహారం అందించాలని నిర్ణయించారు. దీనికోసం ప్రత్యేక అధికారులను నియమించారు. రాంపూర్, లక్ష్మాపూర్, బ్రాహ్మణ బంజెరుపల్లి గ్రామాలకు డీఆర్వో బి. చంద్రశేఖర్, సిద్దిపేట ఆర్డీఓ ఎం. జయచంద్రారెడ్డిలను, పల్లెపహాడ్‌ గ్రామానికి ‘గడా’స్పెషల్‌ ఆఫీసర్‌ ముత్యంరెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ ఎం. జయచంద్రారెడ్డి, హైదరాబాద్‌ ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డిలను, ఏటిగడ్డ కిష్టాపూర్‌ గ్రామానికి ‘గడా’స్పెషల్‌ ఆఫీసర్‌ ముత్యంరెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ ఎం. జయచంద్రారెడ్డి, సిరిసిల్ల ఆర్డీఓ శ్రీనివాస్‌రావులను, వేములఘాట్‌ గ్రామానికి ‘గడా’స్పెషల్‌ ఆఫీసర్‌ ముత్యంరెడ్డి, సిద్దిపేట ఆర్డీఓ ఎం. జయచంద్రారెడ్డి, సికింద్రాబాద్‌ ఆర్డీఓ రాజాగౌడ్, హుస్నాబాద్‌ ఆర్డీఓ కె. అనంతరెడ్డిలను, సింగారం గ్రామానికి గజ్వేల్‌ ఆర్డీఓ డి. విజయేందర్‌రెడ్డి, మల్కాజిగిరి ఆర్డీఓ మధుసూదన్‌లను, ఎర్రవల్లి గ్రామానికి గజ్వేల్‌ ఆర్డీఓ డి. విజయేందర్‌రెడ్డిని ప్రత్యేక అధికారులుగా నియమించారు. 

పరిహారం పంపిణీ ప్రారంభం... 
సింగారం, రాంపూర్‌ గ్రామాల్లో 800 మంది నిర్వాసితులకు చెక్కుల ద్వారా పరిహారం పంపిణీ కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. మిగతా గ్రామాల్లో ప్రత్యేకాధికారుల సమక్షంలో శనివారం నుంచి చెక్కుల పంపిణీ జరగనుంది. నిర్వాసితులెవరైనా చెక్కులు తీసుకోవడానికి విముఖత చూపితే వారి అభిప్రాయాన్ని వీడియో తీయాలని అధికారులు నిర్ణయించారు. 

నిర్వాసితులకు ప్రభుత్వం అందిస్తున్న సాయం.. 
ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన వారికి దేశంలోకెల్లా అత్యంత మెరుగైన పునరావాస ప్యాకేజీని ప్రభుత్వం అందించింది. రైతులు కోల్పోయిన భూములకు, వ్యవసాయ కొట్టాలకు, బావులకు, బోర్‌వెల్స్‌కు, చెట్లకు, తోటలకు, పైపులైన్లకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం పరిహారం అందించింది. పునరోపాధి, పునరావాస ప్యాకేజీ కింద ఇలా సాయం అందిస్తోంది. 
1. కేంద్ర చట్టం ఒక్కో ఇంటికి రూ. 1.25 లక్షల వ్యయమయ్యే 60 గజాల స్థలంలో ఇందిరా ఆవాస్‌ యోజన ఇల్లు మంజూరు చేయాలని చెబుతుండగా రాష్ట్ర ప్రభుత్వం మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు అంతకన్నా నాలుగు రెట్లు ఎక్కువగా, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఒక్కో ఇంటి కోసం రూ. 5.04 లక్షల విలువైన 560 అడుగుల డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తోంది. ఈ ఇళ్లను కూడా ఎక్కడో మారుమూల ప్రాంతంలో కాకుండా గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోని ఎడ్యుకేషన్‌ హబ్‌ పక్కన 460 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వమే నిర్మించి ఇస్తోంది. ఇళ్లు వద్దనుకునే వారికి 250 గజాల ఇంటి స్థలం, రూ. 5.04 లక్షల నగదు అందిస్తోంది. 
2. ప్రస్తుతం ఉన్న ముంపు గ్రామంలోని ఇంటి స్థలానికి గజం రూ. 1,600 చొప్పున లెక్కగట్టి పరిహారం చెల్లిస్తోంది. 
3. కోల్పోయిన ఇంటికి కూడా శాస్త్రీయంగా లెక్కగట్టి పరిహారం చెల్లిస్తోంది. 
4. ఒక్కో కుటుంబానికి రూ. 7.50 లక్షల పునరావాస ప్యాకేజీని అదనంగా అందిస్తోంది.  
5. 18 సంవత్సరాలు దాటిన అవివాహితులకు కూడా రూ. 5 లక్షల పునరావాస సాయం, 250 గజాల ఇంటి స్థలం ఇస్తోంది. 
6. పునరావాస ప్యాకేజీ కింద ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన ఇంటికి ఆర్డీఓ సంతకంతో తహసీల్దార్‌ పట్టా జారీ చేస్తారు. అవసరమైన పక్షంలో ఈ ఇంటిని అమ్ముకోవడానికి, బహుమతిగా కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి అనుకూలంగా ఈ పట్టాలుంటాయి. 
 
మల్లన్నసాగర్‌ నిర్వాసితులకు ప్రభుత్వం అందిస్తున్న పునరోపాధి, పునరావాస కార్యక్రమం కింద గరిష్టంగా దాదాపు రూ. కోటి వరకు సాయం అందుతోందని ప్రభుత్వం చెబుతోంది.ఆ పరిహారం ఇదీ.. 
ఒక్కో కుటుంబానికి అందే మొత్తం: రూ. 7.50 లక్షలు 
ఇద్దరు అవివాహిత పిల్లలుంటే అందే మొత్తం: రూ. 10 లక్షలు 
కుటుంబానికి, పెద్ద పిల్లలకు కలిపి అందే ప్లాట్ల విలువ: రూ.75 లక్షలు (3·250 గజాల ప్లాట్లకు ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం) 
కోల్పోయిన ఇంటికి, ఇంటి స్థలానికి పరిహారం: విస్తీర్ణాన్ని బట్టి  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top