సేకరణ.. సవాల్‌..! | Kaleshwaram Project Irrigation Land Litigation In Yadadri District | Sakshi
Sakshi News home page

సేకరణ.. సవాల్‌..!

Nov 15 2018 9:35 AM | Updated on Mar 6 2019 5:53 PM

Kaleshwaram Project Irrigation  Land Litigation In Yadadri District - Sakshi

కొనసాగుతున్న రిజర్వాయర్‌ నిర్మాణ పనులు

సాక్షి,భువనగిరిఅర్బన్‌ : కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బస్వాపురంలో నిర్మించతలపెట్టిన రిజర్వాయర్‌కు భూ సేకరణ చేయడం అధికారులకు సవాల్‌గా మారింది. భూ సేకరణ కోసం వస్తున్న అధికారులను నిర్వాసితులు అడ్డుకుంటుండడంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. బస్వాపురం మినహా మరెక్కడా భూ సేకరణ పూర్తి కాలేదు. బహిరంగ మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం చెల్లిం చాలని, దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే పనులు చేపట్టాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.సేకరించిన భూ మిలో చేపట్టిన పనులను ఇటీవల బీఎన్‌ తిమ్మాపురం గ్రామానికి చెందిన నిర్వాసితులు అడ్డుకున్నారు. అంతేకాకుండా గ్రామస్తులు పరిహారంపై తేల్చాలంటూ దీక్షలకు దిగారు.

రిజర్వాయర్‌ నీటి నిల్వ సామర్థ్యం : 33.39 టీఎంసీలు
కావాల్సిన భూమి                      : 3,970
 

భువనగిరి మండలంలో...

బీఎన్‌ తిమ్మాపురంలో 1,490 ఎకరాలు
బస్వాపురంలో 1,100 ఎకరాలు 
వడపర్తిలో 430 ఎకరాలు

యాదగిరిగుట్ట మండలంలో... 
 

లప్పనాయక్‌తండాలో 500 ఎకరాలు
తుర్కపల్లి మండలంలో..  
విర్యతండా, చౌక్లతండా, కొక్యతండాల్లో
450 ఎకరాలు 

ఇదీ పరిస్థితి..
బస్వాపురంలో 11.39 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకోసం 3,970 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. రిజర్వాయర్‌ నిర్మాణంలో భువనగిరి మండలంలోని బస్వాపురం, బీఎన్‌ తిమ్మాపురం, యాదగిరిగుట్ట మండలంలోని లప్పనాయక్‌తండా, తుర్కపల్లి మండలంలోని పిర్యాతండా, చౌక్లతండా, కొక్యతండా గ్రామాలకు చెందిన రైతులు తమ భూములు కొల్పోతున్నారు. కాగా భువనగిరి, యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల పరిధిలో కొన్ని గ్రామాల్లో అధికారులు భూసేకరణ కోసం సర్వే చేశారు. సర్వే చేసిన అనంతరం రెవెన్యూ అధికారులకు నివేదికలు అందజేశారు. 
రైతులు ఏమంటున్నారంటే..
దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న  భూములను రిజర్వాయర్‌ కోసం వదులుకోవాల్సి వస్తుందని బీఎన్‌ తిమ్మాపురం రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కోరిన విధంగా పరిహారం ఇప్పించాలని, లేదంటే ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వాలని బీఎన్‌ తిమ్మాపురం ముంపు బాధితులు దీక్షలు చేపట్టారు. అంతేకాకుండా రిజర్వాయర్‌ పనులను ఇటీవల అడ్డుకున్నారు. తల్లిదండ్రుల నుంచి తమకు వారసత్వంగా వచ్చిన భూములను సాగు చేసుకుంటున్నాం.. భూములు కోల్పోతే  తాము జీవనాధారం ఉండదని వారు ఆందోళన చెందుతున్నారు. భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు ఇవ్వాలని బీఎన్‌ తిమ్మాపురం నిర్వాసితులు కోరుతున్నారు. బహిరంగ మార్కెట్‌ రేటు ప్రకారం ఎకరానికి రూ.50లక్షలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.  ఇటీవల 300మంది రైతులు రిజర్వాయర్‌ నిర్మాణ పనులను అడ్డుకున్నారు.
బస్వాపురంలో సర్వే పూర్తి..  
బస్వాపురం గ్రామానికి చెందిన 520 మంది రైతులకు సంబంధించిన 1,100 ఎకరాల భూమిలో రిజర్వాయర్‌ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన 123 ర్టో ప్రకారం ఎకరానికి నష్ట పరిహారం రూ. 13.90లక్షలు ఇస్తుంది. దీనికి రైతులు అంగీకరించడంతో పనులు జరుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన రూ. 50కోట్లు బ్యాంకులో ఉన్నాయి.మిగిలిన వడపర్తి, విర్యతండా, చౌక్లతండా, కొక్యతండాలో, లప్పనాయక్‌తండాలో భూ సేకరణకోసం సర్వే చేయాల్సి ఉంది. 
బీఎన్‌ తిమ్మాపురం గ్రామస్తుల డిమాండ్లు ఇవీ.. 

  •      ఎకరానికి రూ. 50 లక్షలు పరిహారం ఇవ్వాలి 
  •      ఇల్లుకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి
  •      చదువుకున్న వ్యక్తులు ఉంటే ప్రతి ఇంటికి ఒక్క ఉద్యోగం కల్పించాలి  
  •      చదువుకోని వారికి ఉపాధిహామీ అవకాశం కల్పించాలి  
  •      ముంపునకు గురవుతున్న రైతులకు రూ.5 వేల పింఛన్‌ ఇవ్వాలి  
  •      హామీ ఇచ్చిన తర్వాతే సర్వే చేయాలి.


దీక్ష చేస్తున్న బీఎన్‌ తిమ్మాపురం ముంపు బాధితులు 

పరిహారంపై స్పష్టత ఇవ్వాలి
భువనగిరిఅర్బన్‌ :బస్వాపురం రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న రైతులకు పరిహారంపై స్పష్టత ఇవ్వాలని ముంపు బాధితులు డిమాండ్‌ చేశారు. పరిహారం కోసం బీఎన్‌తిమ్మాపురం బాధితులు చేపట్టిన నిరాహార దీక్షలు బుధవారం నా టికి 11వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా దీక్ష ల నిర్వాహకుడు వల్దాస్‌ రాజు మాట్లాడుతూ..  భూములు కొల్పోయే రైతులకు నష్ట పరిహారం గురించి తెలియజేయాలన్నారు. మాకు న్యాయం జరిగే వరకు దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. దీక్షలో రాములు, రాజిరెడ్డి, చిక్కుడు బాలకృష్ణ, నర్సింహ్మ, భాస్కర్, ఈశ్వరమ్మ, కమలమ్మ, మం గమ్మ, వెంకటేష్‌ పాల్గొన్నారు.

స్పష్టమైన హామీ ఇస్తలేరు
ప్రాజెక్ట్‌లో భూములు కోల్పోతున్న తమకు భూమికి భూమి, ఇల్లుకు ఇల్లు నిర్మించి ఇవ్వాలి.   ఎకరానికి రూ.50లక్షల పరిహారం చెల్లించాలి. స్పష్టమైన హామీని అధికారులు ఇవ్వడం లేదు. 


–రావుల నందు, రైతు బీఎన్‌తిమ్మాపురం
జీవనాధారం చూపించాలి 
మాకు జీవనా ధారం చూపిం చాలి. సర్వే చేసిన భూమికి ఎంత రేటును కట్టిస్తారో చెప్పాలి. నాకు రెండు ఎకరాల భూమి ఉంది. నా కుటుంబం దీనిపైనే ఆధారపడి బతుకుతున్నం.

 
– భూక్య పిక్లానాయక్, పిర్యాతండా, తుర్కపల్లి మండలం
ఉద్యోగ అవకాశాలు కల్పించాలి
చదువుకున్న ప్రతి ఇంట్లో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలి. కుటుంబసభ్యులకు ఉపాధిహామీ పనులు కల్పించాలి. కోత్పోతున్న భూములకు మళ్లీ ఎక్కడ ఇస్తారో చెప్పాలి. నష్టపోకుండా చూడాలి.

 –దిరవాత్‌ నరేష్‌నాయక్, లప్పనాయక్‌తండా, యాదగిరిగుట్ట మండలం      

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement