అజ్ఞాతంలోకి జోగు రామన్న

Jogu Ramanna Leaves Home And Switched Off His Mobile - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మాజీ మంత్రి, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లారు. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం లభించకపోవడంతో.. అలక వహించిన జోగు రామన్న ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయినట్టుగా సమాచారం. ఆదివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌లోని తన నివాసంలోనే ఉన్న జోగు రామన్న.. సోమవారం సాయంత్రం గన్‌మెన్లను వదిలి, కుటుంబ సభ్యులకు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో జోగు రామన్న కుటుంబ సభ్యులు ఆయన ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఆయన ఫోన్‌లు కూడా అందుబాటులో లేనట్టుగా తెలుస్తోంది.

కాగా, గత ప్రభుత్వంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా జోగు రామన్న బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఈ సారి కేబినెట్‌ బెర్త్‌పై ఆశలు పెట్టుకున్న ఆయనకు నిరాశే మిగిలింది. ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కుతుందని భావించిన జోగు రామన్న.. తనకు అవకాశం లభించకపోవడంతో అసంతృప్తికి గురైనట్టుగా తెలుస్తోంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top