ఆర్టీసీ ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు జారీ | guidelines aprtc employees division | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు జారీ

Jan 3 2015 2:28 AM | Updated on Sep 2 2017 7:07 PM

ఆర్టీసీ ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు జారీ

ఆర్టీసీ ఉద్యోగుల విభజనకు మార్గదర్శకాలు జారీ

ఇప్పటివరకు ఉమ్మడిగా ఉన్న ఆర్టీసీ విభజన దిశగా ఎట్టకేలకు ముందడుగు పడింది.

* కమలనాథన్ కమిటీ సిఫారసులే అమలు
* ఈ నెల 7 వరకు అభ్యంతరాల స్వీకరణ.. తర్వాత తుది జాబితా

సాక్షి, హైదరాబాద్: ఇప్పటివరకు ఉమ్మడిగా ఉన్న ఆర్టీసీ విభజన  దిశగా ఎట్టకేలకు ముందడుగు పడింది. తెలంగాణ, ఏపీలకు ఆర్టీసీ ఉద్యోగుల కేటాయింపునకు సంబంధించి మార్గదర్శకాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగుల విభజన కోసం కమలనాథన్ కమిటీ రూపొందించిన మార్గదర్శకాలనే ఆర్టీసీ కూడా అనుసరించనుంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధానకార్యదర్శుల సూచన మేరకు కమలనాథన్ కమిటీ మార్గదర్శకాల జాబితాకే పేరు మార్చి ఆర్టీసీ మార్గదర్శకాలుగా పేర్కొంటూ తాజాగా విడుదల చేసింది.

తెలంగాణకు చెందిన జేఎండీ రమణారావు, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఈడీ(అడ్మిన్) వెంకటేశ్వరరావు సంతకాలతో ఇవి జారీ అయ్యాయి. వీటిపై ఎవరికైనా అభ్యంతరాలుంటే ఈ నెల 7వ తేదీలోగా తెలపాల్సిందిగా ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక సంస్థ పాలకమండలి భేటీలో తుది జాబితాను ఆమోదించి ఇరు రాష్ట్రాలకు పంపనుంది. అక్కడి నుంచి షీలా భిడే కమిటీ ద్వారా కేంద్రానికి చేరుతుంది. తాజా మార్గదర్శకాల ప్రకారం స్థానికత ఆధారంగా ఉద్యోగుల కేటాయింపు ఉంటుంది.

6 నుంచి పదో తరగతి వరకు చదివిన ప్రాంతాన్ని స్థానికతగా గుర్తిస్తారు. భార్యాభర్తలు(స్పౌస్ కేసు), ఆరోగ్య సమస్యలు, ఏపీలో కలిపిన పోలవరం ముంపు ప్రాంతాల వారు ఆప్షన్ అడిగే అవకాశం ఉంటుంది. అలాగే ఒక రాష్ట్రంలో పోస్టుల కంటే సిబ్బంది సంఖ్య ఎక్కువగా ఉంటే అదనపు సిబ్బందిని మరో రాష్ట్రానికి బదిలీ చేస్తారు.  ఏపీలో పోస్టుల సంఖ్యకన్నా ఉద్యోగులే ఎక్కువగా ఉన్నందున అదనంగా ఉన్నవారు తెలంగాణకు రానున్నారు. దీంతో తాము నష్టపోతామంటూ తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఇప్పటికే అభ్యంతరం చెబుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement