Sakshi News home page

బాలికపై సామూహిక అత్యాచారం

Published Sun, May 31 2015 1:32 AM

gang raped an girl

మేడిపల్లిలో ఘటన..
ఆలస్యంగా వెలుగులోకి..
ముగ్గురు యువకులు రిమాండ్
 

హైదరాబాద్: ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ బాలిక సామూహిక అత్యాచారానికి గురైన ఘటన హైదరాబాద్ పరిధిలోని మేడిపల్లిలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు కేసును దర్యాప్తు చేసి ఈ దారుణానికి పాల్పడిన ముగ్గురు యువకులను శనివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బోడుప్పల్‌కు చెందిన ఓ మైనర్ బాలిక (16) తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.  ఇంటర్మీడియట్ చదువుతోంది. ఈమెకు ఉప్పల్ భరత్‌నగర్‌లో ఉండే పి.రవి(27)తో పరిచయం ఏర్పడింది. దీంతో ఈ నెల 20న రవి సదరు బాలికకు మాయమాటలు చెప్పి నమ్మించి తాను నివాసం ఉండే భరత్‌నగర్ కు తీసుకొచ్చాడు.

అదే కాలనీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకొని తన స్నేహితులు కస్తూరి లక్ష్మణ్ అలియాస్ సింధు (25), ఆసాల సురేశ్ అలియాస్ సూరి (24)తో కలసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టి పారిపోయాడు. కాగా, బాలిక తల్లిదండ్రులు అదే రోజు సాయంత్రం తమ కూతురు కనిపించడం లేదని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లి దండ్రుల ఫిర్యాదు అనంతరం పోలీసులు విచారణ చేపట్టి వరంగల్‌లో ఉన్న బాధితురాలిని మేడిపల్లికి తీసుకొచ్చి విచారించారు. ఆమె అందించిన వివరాలతో ముగ్గురు యువకులను పోలీసులను అరెస్టు చేశారు.
 
 

Advertisement
Advertisement