అభివృద్ధిలో తొలిప్రాధాన్యం పాలమూరుకే | First priority to Mahaboobnagar in development, says kcr | Sakshi
Sakshi News home page

అభివృద్ధిలో తొలిప్రాధాన్యం పాలమూరుకే

Jul 22 2014 2:17 AM | Updated on Oct 8 2018 5:04 PM

రాష్ట్రాభివృద్ధిలో మహబూబ్‌నగర్ జిల్లాకు మొదటి ప్రాధాన్యం ఇస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.

 సాక్షి, హైదరాబాద్:
 రాష్ట్రాభివృద్ధిలో మహబూబ్‌నగర్ జిల్లాకు మొదటి ప్రాధాన్యం ఇస్తానని సీఎం కేసీఆర్  హామీ ఇచ్చారు. బడ్జెట్‌లో ఈ జిల్లా అభివృద్ధికి *1500 నుంచి *2 వేల కోట్ల నిధులను కేటాయించాలని భావిస్తున్నట్టు తెలిపారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నింటీని పూర్తి చేయడంతోపాటు జూరాల-పాకాల ప్రాజెక్టునూ నిర్మిస్తానని తద్వారా 6.2 ల క్షల ఎకరాలకు కొత్తగా సాగునీరివ్వాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు. చిన్న నీటిపారుదల అభివృద్ధి కోసం ఒక్కో నియోజకవర్గానికి * 15 కోట్లు వెచ్చిస్తామన్నారు. రాష్ట్రంలో ఎమ్మెల్యేల గౌరవాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో నివాస, అధికార కార్యకలాపాలకు ఎమ్మెల్యేలకు భవనాలు నిర్మిస్తామన్నారు. ఈ మేరకు స్థలాలను ఎంపిక చేయాలని జిల్లా కలెక్టర్లకు లేఖ రాసినట్టు చెప్పారు. మాజీ మంత్రి డీకే అరుణ నేతృత్వంలో కాంగ్రెస్ ఎంపీ నంది ఎల్లయ్య, ఎమ్మెల్యేలు వంశీచంద్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, సంపత్ సోమవారం సచివాలయంలో కేసీఆర్‌ను కలిశారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిన తరువాతే జూరాల-పాకాల ప్రాజెక్టు పనులు చేపట్టాలని, గద్వాలలో థర్మల్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని, జిల్లాల పునర్విభజనలో భాగంగా గద్వాలను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. థర్మల్ పవర్ ప్లాంట్ మినహా మిగతా అంశాలపై ఆయన సానుకూలంగా స్పందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement