అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించబోమని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు.
హైదరాబాద్ : అవినీతికి పాల్పడితే ఎవరినీ ఉపేక్షించబోమని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. గడిచిన అయిదు నెలల కాలానికి సంబంధించి ఆర్థిక శాఖ పనితీరు, ఆదాయ-వ్యయాలపై ...సచివాలయంలో అధికారులతో ఆయన శనివారం సమీక్ష నిర్వహించారు. 92 శాతం ఆదాయానికి చేరుకున్నామని వెల్లడించిన మంత్రి...రాష్ట్రంలో సంక్షేమ పథకాలకు నిధులు పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు.
ఆర్థిక శాఖ పనితీరు సమర్థవంతంగా ఉందని, ప్రభుత్వ సొమ్ము ప్రజల డబ్బుగా భావించి ఖర్చు చేస్తున్నామని, ఆయాశాఖల్లో ఆడిట్ నివేదికల ద్వారా అవినీతిని అరికడుతున్నామని ఈటెల తెలిపారు. రైతుల రుణమాఫీల్లో కొంత మేర గాడి తప్పినట్లు సమాచారం ఉందని, మొదటి,రెండో విడత రైతుల రుణ మాఫీలో కొంత అవినీతి జరిగిందని తెలిపారు. అందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఈటల హెచ్చరించారు. గుడుంబాను అరికట్టేందుకే చౌక మద్యం తెస్తున్నామని, ప్రభుత్వ ఆదాయ వనరుగా మద్యం విధానాన్ని చూడటం లేదని ఆయన అన్నారు.