చుక్కేసి బండి నడిపితే కటకటాల్లోకే..! | drink and driving cases jail sentences | Sakshi
Sakshi News home page

చుక్కేసి బండి నడిపితే కటకటాల్లోకే..!

Dec 5 2017 11:21 AM | Updated on Dec 5 2017 11:21 AM

drink and driving cases jail sentences - Sakshi

రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ప్రస్తుతం సిద్దిపేటలో మద్యం తాగి వాహనం నడిపితే చాలు.. పోలీసులు పట్టుకుని కోర్టులో హాజరుపరిస్తే ఏకంగా నెల రోజుల జైలు శిక్ష విధిస్తున్నారు. ఇటీవల కాలంలో సిద్దిపేట జిల్లాలో వారం రోజులకు తగ్గకుండా జైలు శిక్షలు విధిస్తూ మద్యం తాగి వాహనం నడిపేవారిని కట్టడి చేస్తున్నారు. 

సిద్దిపేట నుంచి బట్ట ప్రభాకర్‌: మందు బాబులకు పెద్ద చిక్కొచ్చి పడింది..! మద్యం తాగి వాహనం నడిపితే చాలు జైలుకు వెళ్లాల్సిన పరి స్థితి వచ్చింది. పోలీసు శాఖ చేపట్టిన డ్రంకెన్‌ డ్రైవ్‌లో వందలాది మంది మందుబాబులు చిక్కుతున్నారు. ఆల్కహాల్‌ తాగినట్లు బ్రీత్‌ ఎనలైజర్‌ చూపిస్తే ఊచలు లెక్కించాల్సిందే. మోతాదుగా తీసుకున్నట్టు తేలితే జరిమానా సరిపోతుంది. ఒక్క లైట్‌ బీరు లేదా 15 ఎంఎల్‌ మద్యం సేవిస్తే.. బ్రీత్‌ ఎనలైజర్‌లో 30 శాతం చూపిస్తుంది. రెండు పెగ్గులు, హార్డ్‌ బీరు తాగితే 60– 120 శాతం వరకు చూపిస్తుంది. 30 శాతం వరకు ఫైన్‌ తో వదిలేస్తున్నారు. 35శాతం దాటితే.. ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరుస్తున్నారు. 

ఇటీవల జైలు శిక్ష ఘటనలు కొన్ని..
 సిద్దిపేట జిల్లా ఏర్పడిన 14 నెలల్లో 954 కేసులు నమోదయ్యాయి. ఇందులో 150 మందికి జైలు శిక్ష పడగా రూ.7,18,200 ఫైన్‌ల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది.

♦ ఆసిఫాబాద్‌ జిల్లా రెబ్బెన మండలం రాంపూర్‌ వాసి  శ్రీనివాస్‌ లారీ డ్రైవర్‌.  నవం బర్‌ 24న రాత్రి లారీపై హైద రాబాద్‌ నుంచి ఆసిఫాబాద్‌  వెళ్తున్నాడు. కుకునూరుపల్లి పోలీసులు అతన్ని బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించగా 290 ఎంజీ వచ్చింది. మరుసటి రోజు కోర్టులో హాజరుపరు చగా 30 రోజుల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. 

♦ గజ్వేల్‌ మండలం ప్రజ్ఞాపూర్‌ గ్రామానికి చెందిన మెత్కు స్వామి మద్యం తాగి టూవీలర్‌ నడుపుతుండగా పోలీసులు పట్టుకున్నారు. బ్రీత్‌ ఎనలైజర్‌తో పరీక్షించగా 100శాతం వచ్చింది. దీంతో అతన్ని కోర్టులో హాజరుపర్చగా.. 20రోజుల జైలు శిక్షతోపాటు రూ. 1,000 ఫైన్‌ విధించింది. 

♦ నవంబర్‌ 16న కొమురంభీం జిల్లా త్రీయానికి చెందిన లారీ డ్రైవర్‌ దేవసాని శంకర్‌. లారీ తోలుకుంటూ హైదరాబాద్‌ వెళ్తున్నాడు. ప్రజ్ఞాపూర్‌ వద్ద గజ్వేల్‌ ట్రాఫిక్‌ పోలీసులు అతన్ని పరీక్షించగా 220ఎంజీ రిపోర్టు చూపించింది. ఈ కేసులో అతడికి 15రోజుల జైలు, రూ.1,000జరిమానా విధించారు. 

అలాగే ప్రజ్ఞాపూర్‌కు చెందిన ఐలాపూర్‌ స్వామి, శ్రీకాంత్‌లు వేర్వేరుగా టూవీల్లరు వాహనంపై వెళ్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. వారు ఇద్దరు మద్యం సేవించినట్లు నిర్ధారణ రావడంతో కోర్టులో ఇరువురికి ఏడు రోజుల జైలు, రూ. 1,000చొప్పున జరిమానా పడింది. 

♦ దుబ్బాకకు చెందిన యాదయ్య మద్యం సేవించి ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో దుబ్బాక పోలీసులు పట్టుకుని అతన్ని పరీక్షించగా 179ఎంజీ వచ్చింది. అతడికి ఏడు రోజుల జైలుతోపాటు  రూ. 1,000 జరిమానా విధించింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement