
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ లబ్ధిదారులకు పౌష్టికాహారాన్ని అందించాల్సిందేనని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకూ పౌష్టికాహార పంపిణీని ఆపవద్దని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో శుక్రవారం డీఎస్ఎస్ భవన్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టీనా జెడ్ చోంగ్తూ తదితరులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఆరోగ్య లక్ష్మి పథకం కింద అందించే భోజనాన్ని ఉదయం 9 గంటల నుంచి 11 గంటల్లోపు వండి, పంపిణీ చేయాలన్నారు. ఈ పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు తింటేనే మంచి ఫలితాలు వస్తాయని, ఈమేరకు చర్యలు తీసుకోవాలన్నారు. క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసే అంగన్వాడీ టీచర్లు, సహాయకులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.