దేవరకొండలో దుబారా ! | Deverakonda in Electric poles west Electricity | Sakshi
Sakshi News home page

దేవరకొండలో దుబారా !

Apr 30 2016 4:38 AM | Updated on Sep 5 2018 2:25 PM

విద్యుత్.. ఈ పదం ప్రభుత్వాలను నిలబెట్టగలదు.. కూల్చేయనూగలదు.. ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్న కరువులో...

దేవరకొండ : విద్యుత్.. ఈ పదం ప్రభుత్వాలను నిలబెట్టగలదు.. కూల్చేయనూగలదు.. ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్న కరువులో విద్యుత్‌ను పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యపై దేవరకొండ నగర పంచాయతీ అధికారులు గానీ.. ప్రజాప్రతినిధులు గానీ దృష్టి సారించడం లేదు. 40 వేల జనాభా ఉన్న నగర పంచాయతీలో సుమారు 100 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, 3 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు ఉన్నాయి.

ఈ విద్యుత్ స్తంభాలన్నింటికీ ట్యూబ్‌లైట్లు అమర్చారు. ఇందులో సుమారు రెండు వేల ట్యూబ్‌లైట్లకు ఆన్ ఆఫ్ స్విచ్‌లు లేవు. దీంతో ఇవి 24 గంటలూ.. 365 రోజులూ.. విద్యుత్ ఉన్నంత సేపూ నిత్యం వెలుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నగర పంచాయతీ ప్రతి నెలా సుమారు రూ. 3 లక్షలకుపైగా కరెంట్ బిల్లు చెల్లిస్తోంది. స్తంభాలకు ఉన్న ట్యూబ్‌లైట్లకు ఆన్ ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేయకపోవడంతో ఏటా అప్పనంగా సుమారు రూ.20 లక్షలు విద్యుత్ శాఖకు చెల్లిసున్నట్లు తెలుస్తోంది.
 
పట్టించుకోని పాలకులు, అధికారులు
ఇటీవల కాలంలో సుమారు 6 ట్రాన్స్‌ఫార్మర్ల పరిధిలో రూ.6 లక్షల వ్యయంతో కొన్ని విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి ఏప్ స్విచ్‌లు అమర్చేందుకు విద్యుత్ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. మరో రూ.30 లక్షల వ్యయంతో నగర పంచాయతీలోని వీధి దీపాలన్నింటికి ఆన్‌ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేస్తే ప్రతి నెలా ఇప్పుడు చెల్లిస్తున్న రూ.3.20 లక్షల విద్యుత్ బిల్లులో సగం వరకు ఆదా అవుతుంది. అంటే సుమారు నగర పంచాయతీ ప్రతి ఏటా విద్యుత్ చార్జీలపైనే రూ. 20 లక్షల ఆదాయాన్ని మిగుల్చుకునే అవకాశం ఉంది. అయినా.. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు.
 
అయినా అంతే..
నగర పంచాయతీ గతంలో విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన బకాయి రూ. కోటి వరకు ఉండేది. దీంతో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ నిలిపివేశారు. ఎట్టకేలకు నగర పంచాయతీ అధికారులు కొంత వరకు బకాయిలు చెల్లించారు. దీంతో మళ్లీ కరెంట్ విద్యుత్‌ను పునరుద్ధరించారు. అయినా.. ఆదా చేయాలనే ఆలోచన ఎవరూ చేయక పోవడం గనార్హం.
 
సమన్వయ లోపమే...
సమన్వయ లోపంతోనే విద్యుత్ వృతా అవడంతోపాటు ప్రజాధనం దుబారా అవుతోంది. కరెంట్‌ను ఆదా చేసేందుకు విద్యుత్ అధికారుల కన్నా.. విద్యుత్ వృథాకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సి బాధ్యత ఆదాయం కోల్పోతున్న నగర పంచాయతీ అధికారులదే.  ఏప్ స్విచ్‌లు అమర్చడానికి విద్యుత్ శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అందుకయ్యే వ్యయం రూ.30 లక్షలు నగర పంచాయతీ భరించాల్సి ఉంది. కానీ.. ఆదాయం మిగుల్చుకునే ఆలోచన పంచాయతీ అధికారులుగానీ.. ప్రజాప్రతినిధులుగాని చేయడం లేదు. దీంతో ఏటా లక్షల రూపాయల  ప్రజా ధనం దుబారా అవుతోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యుత్ వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement