3వ దశకు వ్యాక్సిన్‌ ప్రయోగాలు

Corona Vaccine Experiments In Phase 3 - Sakshi

కరోనా మందు తయారీలో కంపెనీల ముందడుగు

సాధారణంగా టీకా అభివృద్ధికి 10–12 ఏళ్ల సమయంపట్టే అవకాశం

వైరస్‌ కల్లోలం నేపథ్యంలో నెలల వ్యవధిలోనే తుదిదశకు ట్రయల్స్‌  

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ టీకా ల అభివృద్ధి పుంజుకుంటోంది. అమెరికాతోపాటు బ్రిటన్, చైనాల్లోనూ పలు టీకాల అ భివృద్ధికి జరుగుతున్న ప్రయత్నాలు తుది దశకు చేరుకుంటున్నాయి. అమెరికాలో 3 కంపెనీలు ఒకట్రెండు నెలల్లో మూడోదశ మానవ పరీక్షలు నిర్వహించనున్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ (ఎన్‌ఐహెచ్‌) వాటికి నిధులు సమకూర్చేందుకు పచ్చజెం డా ఊపినట్లు అమెరికాలోని ఓ వార్తపత్రిక కథనాన్ని ప్రచురించింది. అన్నింటికంటే ముందుగా మోడెర్నా అనే కంపెనీ అభివృద్ధి చేసిన టీకాను వచ్చే నెలలో సుమారు 30 వేల మందిపై ప్రయోగించనున్నారు. వారి ని రెండు బృందాలుగా విడదీసి ఒక బృందానికి టీకా ఇస్తారు. రెండో బృందంలోని స భ్యులకు ఉత్తుత్తి మందు అందజేస్తారు. ఈ ప్రయోగాలు ఒకవైపు నడుస్తుండగానే ఆగస్టులో ఆస్ట్రాజెనెకా టీకా పరీక్షలు, సెప్టెంబ ర్‌లో జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకా పరీక్షలు నిర్వహించాలని ఎన్‌ఐహెచ్‌ ప్రణాళికలు సిద్ధం చేసింది.

తొలి అడుగు ‘మోడెర్నా’దే...
చైనాకు ఆవల తొలి కరోనా వైరస్‌ నమోదు కాకముందే అమెరికా బయోటెక్‌ కంపెనీ మోడెర్నా టీకా కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ‘ఎంఆర్‌ఎన్‌ఏ 1273’ ఆధారిత టీకాను ఈ ఏడాది జనవరిలోనే సిద్ధం చే సింది. ఫిబ్రవరిలో తొలిదశ ప్రయోగాలు మొదలుపెట్టి 45 మందికి ప్రయోగాత్మక టీకాను అందించింది. టీకా అందుకున్న వా రిలో రోగనిరోధక వ్యవస్థ స్పందన మెరుగ్గా ఉందని, వైరస్‌ బారినపడి చికిత్స తరువాత కోలుకున్న వారితో సరిపోల్చదగ్గ స్పందన నమోదైనట్లు ప్రకటించింది. ఈ టీకా శరీరం లో వైరస్‌కు వ్యతిరేకంగా యాంటీబాడీలు తయారయ్యేందుకూ సాయపడుతున్నట్లు గుర్తించింది. మార్చి నెలాఖరులో వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నట్లు ప్రతినెలా లక్షల డోసులు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించిన మోడెర్నా... అమెరికా ప్రభుత్వ సంస్థల నుంచి భారీగా నిధులు కూడా సమకూర్చుకుంది. రెండో దశ ప్రయోగాలకు ఏప్రిల్‌ 27న ఎఫ్‌డీఏకు దరఖాస్తు చేసుకోగా మే 7న అనుమతులు లభించాయి.

రేసులో ఆస్ట్రాజెనెకా.. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌
మరోవైపు ఆస్ట్రాజెనెకా ఫార్మా కంపెనీ ఏప్రి ల్‌లో ఏజెడ్‌డీ1222 మందును వెయ్యి మం దిపై ప్రయోగించింది. ఇక జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కంపెనీ అమెరికా, బెల్జియంలో  సుమారు వెయ్యి మందిపై ప్రయోగాలకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ప్రయోగాలు మొదలుకావచ్చని అనుకున్నా 2ు నెలల ముందే, అంటే వచ్చే నెలలో ప్రా రంభించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది. కరోనా ప్రపంచానికి పరిచయమై ఆరు నెలలు కూడా గడవక ముందే ప్రపంచవ్యాప్తంగా కనీసం పది చోట్ల టీకాల పై మానవ ప్రయోగాలు వివిధ దశల్లో ఉం డగా మరో 126 ప్రీ క్లినికల్‌ పరిశోధన దశలో ఉన్నాయి.

పుంజుకున్న వేగం
సాధారణంగా ఒక టీకా అభివృద్ధి చేసేందుకు పది నుంచి పన్నెండేళ్ల సమయం పడుతుంది. అయితే కోవిడ్‌–19 పరిస్థితుల్లో దీన్ని వీలైనంత వేగంగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. టీకాను విస్తృత వాడకంలోకి తెచ్చేందుకు దాన్ని పలు దశల్లో పరీక్షించి సురక్షితమా కాదా? దుష్ప్రభావాలు ఏమైనా ఉంటాయా? అన్నవి నిర్ధారించుకుంటారన్నది తెలిసిందే. అన్నింటికంటే ముందు ఎంచుకున్న రసాయనం/సూక్ష్మజీవి శరీరంలో ఎలా జీర్ణమవుతుందో గుర్తిస్తారు. దీన్ని ఫేజ్‌ జీరో అని పిలుస్తారు. ఆ తరువాత ఆ మందు సురక్షితమేనా? దుష్ప్రభావాలు ఏమిటి? అన్న అంశాలపై ప్రయోగాలు జరుగుతాయి. ఈ తొలిదశ ప్రయోగాల తరువాత వ్యాధిని మందు నిరోధిస్తుందా? అన్నది పరిశీలిస్తారు. తుది దశలో వేలాది మందికి ఈ టీకా ఇచ్చి ఫలితాలను... టీకా ఇవ్వని వారితో పోల్చి చూస్తారు. ఈ దశలన్నీ దాటుకున్న తరువాతే టీకా వాడకానికి ప్రభుత్వ సంస్థలు అనుమతులిస్తాయి. ఒక్కో దశను పూర్తి చేసేందుకు చాలా సమయం పడుతుంది కూడా. సాధారణ పరిస్థితుల్లో ఏ మందైనా మూడో దశకు చేరుకోవడమే అతికష్టమ్మీద జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలోనే కేవలం కొన్ని నెలల వ్యవధిలో కోవిడ్‌–19 టీకాలు తుది దశకు చేరుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top