ఎన్ఐటీలు/ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ (జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్) మెయిన్స్ ప్రవేశ పరీక్ష శనివారం హైదరాబాద్లో ప్రశాంతంగా జరిగింది.
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీలు/ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ (జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్) మెయిన్స్ ప్రవేశ పరీక్ష శనివారం హైదరాబాద్లో ప్రశాంతంగా జరిగింది. 97 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు జేఈఈ హైదరాబాద్ కోఆర్డినేటర్ సీతాకిరణ్ వెల్లడించారు. 60 కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన రెండు పేపర్లకు 51,074 మందికిగాను 49 వేల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష సమయానికి దాదాపు గంట ముందుగానే కేంద్రాలకు విద్యార్థులు చేరుకోవడం విశేషం.
హనుమాన్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధించడంతో కొన్నిచోట్ల విద్యార్థులకు ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. కొందరు సకాలంలో పరీక్ష కేంద్రానికి చేరుకోలేకపోవడంతో పరీక్షకు హాజరుకాలేదు. కన్నీటి పర్యంతమై భారంగా అక్కడి నుంచి వెనుదిరిగారు. మరోపక్క విద్యార్థులకు తోడుగా వచ్చిన తల్లిదండ్రులు, స్నేహితులు నిలువనీడ లేక తీవ్ర అవస్థలు పడ్డారు. పలు జిల్లాలకు చెందిన విద్యార్థులు హైదరాబాద్లోనే పరీక్ష రాశారు. మరోవైపు వరంగల్లోనూ ఈ పరీక్ష ప్రశాంతం గా ముగిసింది. పేపర్-1కు 97.5 శాతం, పేపర్-2కు 94.5 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని ఐఐటీ జేఈఈ మెయిన్స్ పరీక్ష కో ఆర్డినేటర్ జి.మథ్యాస్రెడ్డి తెలిపారు.