బండరాయితో మోది.. గొంతునులిమి.. | Sakshi
Sakshi News home page

బండరాయితో మోది.. గొంతునులిమి..

Published Wed, Nov 5 2014 12:02 AM

Brutal murder of woman

కీసర: ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తుతెలియని దుండగులు ఆమె తలపై బండరాయితో మోది.. చీరతో ఉరివేసి చంపేశారు. హతురాలు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా వాసి. ఈ సంఘటన మంగళవారం మండల పరిధిలోని రాంపల్లి గ్రామంలో వెలుగుచూసింది.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని పాలకొల్లు గ్రామానికి చెందిన పోనగంటి లక్ష్మి,(33)ధన్‌బాబు ద ంపతులు. వీరు పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం శామీర్‌పేట్ మండలం పోతారం గ్రామానికి వలస వచ్చారు. గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి పౌల్ట్రీఫాంలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి కూతురు(13) హైదరాబాద్‌లోని తన మేనమామ వద్ద ఉంటోంది.

ఇదిలా ఉండగా సోమవారం పని నిమిత్తం ఫాంహౌస్ నుంచి వెళ్లిన లక్ష్మి ఎంతకూ తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం మండల పరిధిలోని రాంపల్లి-చర్లపల్లి రహదారి సమీపంలో ఉన్న శ్రీనగర్‌కాలనీ వెంచర్‌కు దగ్గర నిర్మానుష్య ప్రదేశంలో ఓ మహిళ మృతదేహం పడి ఉండడంతో అటుగా వెళ్లిన పశువుల కాపరి గమనించి కీసర పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

స్థానిక సీఐ గురువారెడ్డి, అల్వాల్ ఏసీపీ ప్రకాశ్‌రావు తదితరులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. హతురాలి వద్ద ఉన్న నంబర్‌కు ఫోన్ చేయగా లక్ష్మి వివరాలు తెలిశాయి. దుండగులు మహిళ తలపై బండరాయితో మోది.. అనంతరం చీరకొంగుతో గొంతు నమిలి చంపేసిన ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

పోలీసు జాగిలం ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న రాంపల్లి-చర్లపల్లి ప్రధాన రహదారి వరకు వెళ్లి తిరిగి వచ్చింది. పరిచయం ఉన్న వ్యక్తులే లక్ష్మిని తీసుకొచ్చి చంపేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement