'వారి ధనబలం ముందు ఓడిపోయాం'

BJP Fails Huzurnagar Election In Front Of Money - Sakshi

సాక్షి, హైదరాబాద్: హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్ఎస్, కాంగ్రెస్ ధనబలం ముందు ఓడిపోయామని బీజేపీ ఎమ్మెల్సీ నరపరాజు రామచంద్రరావు అన్నారు. గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికార బలంతో టీఆర్ఎస్ గెలించిందని, అయినా టీఆర్‌ఎస్ పార్టీకి ఆశించిన స్థాయిలో ఓట్లు రాలేదన్నారు. కేసీఆర్‌ ప్రభుత్వం హుజుర్‌నగర్‌ గెలుపుతో అహంకారం పెంచుకోవద్దన్నారు. స్థానికంగా హుజుర్‌నగర్‌లో బీజేపీ బలంగా లేదని అభిప్రాయపడ్డారు. మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ సిద్ధంగా ఉందని తెలిపారు.

ప్రభుత్వం అహంకారాన్ని పక్కన బెట్టి, ఆర్టీసీ కార్మికులని చర్చలకు పిలవాలని డిమాండ్‌ చేశారు. ట్రేడ్ యూనియన్లు, లీగల్ బాడీస్ కార్మికులకు.. ఆర్టీసీని ప్రభుత్వంలో ఎందుకు విలీనం చేయలేమో అనే అంశంపై  వారికి స్పష్టత ఇవ్వాలన్నారు. కార్మికులకు పనిచేసే వాతావరణం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమ్మెలకు, కోర్టుకు పోవద్దంటే.. ఆర్టీసీ కార్మికులు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నించారు. ప్రతి రాష్ట్రానికి ఒక్కో విధానం ఉందని, ఆర్టీసీని అంతమొందించాలని చూస్తున్నారని ఆరోపించారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల ఫలితాలు.. ఆర్టీసీని అణిచివేయడానికి ఆమోదముద్ర కాదన్నారు. ఉన్నపళంగా 48 వేల మంది కార్మికులను తీసేస్తే.. అందుకు సంఘీభావం ప్రకటించిన బీజేపీ రాష్ట్ర నేతలపై.. ఎందుకు ప్రధాని మోదీకి లేఖ రాశారని ప్రశ్నించారు. ఇప్పటివరకూ రైల్వే ప్రైవేటికరణ జరగలేదని, ప్రయోగాత్మకంగా ప్రయివేట్ రైలు నడిపిందని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top