50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ | 50 thousand metric tons of grain collection says lakshmi kantam | Sakshi
Sakshi News home page

50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

May 28 2014 1:16 AM | Updated on Sep 2 2017 7:56 AM

రబీ సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు రైతుల నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు.

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రబీ సీజన్‌కు సంబంధించి ఇప్పటి వరకు రైతుల నుంచి 50 వేల మెట్రిక్ టన్నుల వరిధాన్యం కొనుగోలు చేసినట్లు జిల్లా సంయుక్త కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తెలిపారు. మార్కెటింగ్, డీఆర్డీఏ, పౌరసరఫరాలశాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్లపై మంగళవారం జేసీ తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. గతేడాది రైతుల వద్ద నుంచి 33 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. రోజూ ధాన్యం రైస్‌మిల్లులకు తరలించడానికి పౌర సరఫరాల శాఖ, ఐకేపీ ద్వారా 125 లారీలు, డీటీసీ ద్వారా 75 లారీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వెంటనే ధాన్యం దిగుమతి చేసుకోవాలని, దిగుమతి చేసుకోని మిల్లర్లపై రూల్ 6 ఏ ద్వారా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

 ధాన్యం కొనుగోళ్ల సమాచారం కోసం డీఎస్‌వో కార్యాలయంలో కంట్రోల్ రూం(08732-226852) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. టెలిఫోన్ కాల్స్ వివరాలు రిజిష్టర్‌లో నమోదు చేస్తామన్నారు. కంట్రోల్ రూంలో ఉద్యోగులు అందుబాటులో లేనట్లు ఫిర్యాదు వస్తే చర్య తీసుకోవాలని డీఎస్‌వోకు చెప్పారు.ఈ టోల్‌ఫ్రీ నంబర్ ఈ నెల 28 నుంచి జూన్ 5 వరకు పనిచేస్తుందని తెలిపారు. జిల్లాలో మూడు లక్షల గోనే సంచులు అందుబాటులో ఉంచామని చెప్పారు. లక్సెట్టిపేట, మంచిర్యాల, భైంసా, నిర్మల్, ఖానాపూర్, సారంగాపూర్ మార్కెట్‌యార్డుల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డీఎస్‌వో వసంత్‌రావు దేశ్‌పాండే, డీఎం ఆనంద్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏడీ శ్రీనివాస్, డీఆర్‌డీఏ ఏపీఎం చరణ్‌దాస్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కాంతయ్య, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement