నేడు అవ్వల్‌పేన్ పూజ | Sakshi
Sakshi News home page

నేడు అవ్వల్‌పేన్ పూజ

Published Sat, Oct 15 2016 12:20 PM

pochamma pooja in keramori

ఏర్పాట్లు చేసిన ఐటీడీఏ
తరలివెల్లిన భీం వారసులు
 
కెరమెరి : పోరాట యోధుడు కుమ్రం భీంకు శనివారం సాయంత్రం భీం వారసులు గిరిజన సంప్రదాయం ప్రకారం అవ్వాల్(పోచమ్మ) పూజ నిర్వహించనున్నారు. అనాధిగా వస్తున్న ఈ ఆచారాన్ని కొనసాగిస్తూ నేడు పోచమ్మతల్లికి పూజలు చేస్తారు. పోరాటం కంటే ముందు మిటలరీ సర్కారును గడగడలాడించడంలో ఎంతో కారుణ్యం చూపిన పోచమ్మ దైవానికి వారి సంస్క­ృతి, ఆచార వ్యవహారాలతో పూజ చేస్తారు. ఏటా వర్ధంతికి ఒక రోజు ముందు ఈ కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీ.
 
 తేనెటీగలే అస్త్రాలుగా..
 నైజాం మిలటరీపై భీం ఎన్నో ఏళ్లుగా నిరాటంకంగా పోరాటం సాగించడానికి కారణం పోచమ్మతల్లి మంత్ర దండమేనని చరిత్ర చెబుతోంది. వేల సంఖ్యలో పోలీసులు భీంపై కాల్పులు జరిపినా తూటాలు మాత్రం ఆయనకు తాకేవి కావు. పోలీసులు దగ్గరికి చేరగానే మంత్రదండం శక్తి ద్వారా తేనెటీగలు తయారు చేసి వాటిని అస్త్రాలుగా ఉపయోగించి పోలీసులపై వదిలేవాడు.
 
 అలాగే ఆముదం విత్తనాలను మంత్ర శక్తి ద్వారా ఉపయోగించి స్వీయ రక్షణ పొందేవాడు. ఇన్ని విధాలుగా ఆ మంత్ర దండ  శక్తి భీంకు ఉపకరించడంతో భీం వారసులు పోచ్మతల్లికి ఘనంగా పూజలు చేస్తుంటారు. జోడేఘాట్‌లోని భీం సమాధికి నివాళిలర్పించి ముందున్న జెండాలను ఎగురవేస్తారు. గొర్రెను బలిచ్చి మొక్కు తీర్చుకుంటారు. ఇందుకోసం ఐటీడీఏ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భీం వారసులతోపాటు, ఆరాధికులు పెద్ద ఎత్తున తరలివెళ్లి పూజలు చేస్తారు.
 
 భీంతోపాటే సూరు వ ర్ధంతి..
 కుమ్రంభీంతో పాటు ఆయన సహచరుడు కుమ్రం సూరు వర్ధంతిని కూడా నేడు కొలాం ఆదివాసీలు ఘనంగా నిర్వహించేందుకు సన్నహాలు చేశారు. గతంలో వారికి వేదిక లేకపోవడంతో కొన్ని సార్లు ఉట్నూర్‌లో, మరి కొన్ని సార్లు ఆసిఫాబాద్‌లో వర్ధంతి జరిపారు. కాని ఈ ఏడాది భీంతో పాటే సూరు వర్ధంతి జరిపేందుకు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్వీ కర్ణణ్‌తోపాటు కుమ్రం భీం ఉత్సవ కమిటీ సభ్యులను కోరిన నేపథ్యంలో వారి అనుమతితో నేడు సాయంత్రం సంప్రదాయ పూజలు నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement