ఖమ్మం కీలకం.. | khammam will play key role after bifurcation | Sakshi
Sakshi News home page

ఖమ్మం కీలకం..

Oct 17 2016 4:09 PM | Updated on Jun 4 2019 5:16 PM

పునర్విభజన తర్వాత ఖమ్మం జిల్లా పురోభివృద్ధిలో కీలకంగా మారనుంది..

పునర్విభజన నేపథ్యంలో... 
అభివృద్ధిలో నగరానిదే కీలక పాత్ర 
వాణిజ్యపరంగా మరింత పురోగతి 
మున్ముందుకు వ్యవసాయరంగం 
 
సాగర్‌ కాలువ.. రెండు రిజర్వాయర్లు.. వ్యవసాయ రంగం.. గ్రానైట్‌ పరిశ్రమలు.. విస్తరిస్తున్న రియల్‌ఎస్టేట్,  వస్త్ర వ్యాపారం.. ఇలా దినదినం ప్రవర్థమానంగా వెలుగొందుతోంది. పునర్విభజన తర్వాత ఖమ్మం జిల్లా పురోభివృద్ధిలో కీలకంగా మారనుంది.. వ్యాపారాల కోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి బతుకునిస్తోంది.. జిల్లా అభివృద్ధికి నగరమే ఆయువుపట్టు కానుంది. 
 
ఖమ్మం: ఖమ్మం జిల్లాకు స్తంభాద్రి కీలకం కానుంది. పునర్విభజన తర్వాత ఐదు నియోజకవర్గాలకే పరిమితమైన జిల్లాకు ఖమ్మం దిక్సూచి కానుంది. ఒకప్పుడు గ్రానైట్‌కు మారుపేరుగా ఉన్న జిల్లా.. కొన్ని ఆటుపోట్ల మధ్య పరిశ్రమలు కాస్త దివాళా తీశాయి. సాగర్‌ ఎడమ కాలువ, పాలేరు రిజర్వాయర్, వైరా రిజర్వాయర్‌ ఉండటం వల్ల జిల్లాలో ఆయకట్టు పెరిగింది. ఈ నేపథ్యంలో ఖమ్మం వాణిజ్య నగరంగా మరింత పురోగతి సాధిస్తుండగా.. వ్యవసాయమే ప్రధానం కానుంది. 4,374 చ.కి.మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న జిల్లాలో ఎక్కువ శాతం సాగుతోనే ముందుకు సాగనుంది.  
 
ఇదీ ఖమ్మం చరిత్ర.. 
ఖమ్మం కార్పొరేషన్ ను పూర్వం ఖమ్మం మెట్టుగా వ్యవహరించేవారు. దీని సరైన పేరు కంబం మెట్టు.. సంస్కృతంలో స్తంభాచలం అనే పేరుతో ‘హరిభట్టు’ అనే సంస్కృత కవి ఉదహరించినట్లు చెబుతారు. దీనికే ‘స్తంభగిరి’, ‘స్తంభాద్రి’ అనే పేర్లు కూడా ఉండేవి. ఈశ్యానం దిక్కున ఉన్న గుట్టపై ఈ గ్రామ ప్రజల ఆరాధ్య దైవం స్తంభాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం ఉంటుంది. అలాగే 1530లో హరిభట్టు రాసిన వరహాపురాణంలో ఖమ్మం నగర ప్రాముఖ్యతను వివరించినట్లు ఆధారాలు ఉన్నాయి. కాకతీయ రాజులు– వేంగి చాళుక్యులకు సామంతులుగా ఉన్న రోజుల్లో క్రీస్తు శకం 934 నుంచి 945 మధ్య కాలంలో కాకర్త్యగుండనార్యుడు, బేతరాజు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు చరిత్ర చెబుతోంది. నిజాం రాష్ట్రంలో ఉన్న ఖమ్మం.. వరంగల్‌ జిల్లాలో ఒక తాలూకాగా ఉండేది. ఖమ్మం తహసీల్‌కు 1761 నుంచి 1803 వరకు జఫరద్దౌలా తహసీల్దార్‌గా ఉండేవారు. ఆ తర్వాత 1953, నవంబర్‌ 1న ఖమ్మం పట్టణం జిల్లా కేంద్రంగా ప్రత్యేక జిల్లాగా ఆవిర్భవించింది. ఇలా వెయ్యేâýæ్లకుపైగా చరిత్ర కలిగిన నగరం విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలు, తెలంగాణ, ఆంధ్రా మాండలికాల కలగలుపుగా.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా.. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థా¯ŒS, గుజరాత్‌ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమూహంగా వెలుగొందుతోంది. 
 
స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా.. 
1942, ఏప్రిల్‌ ఒకటిన స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా ఏర్పడిన ఖమ్మం.. 1952లో గ్రేడ్‌–3 మున్సిపాలిటీగా మారింది. 1959లో గ్రేడ్‌–2 మున్సిపాలిటీగా అవతరించింది. పట్టణ జనాభా పెరుగుతుండటంతో 1980లో గ్రేడ్‌ –1 మున్సిపాలిటీగా మార్చారు. తర్వాత 2005, మే 2001న స్పెషల్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీగా నగరం ఆవిర్భవించింది. రెండు దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలో వేగవంతంగా ఖమ్మం మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుండటంతో 2012, అక్టోబర్‌ 19న కార్పొరేషన్ గా అప్‌గ్రేడ్‌ చేస్తూ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 
 
రూ.1,200కోట్లకు చేరిన మార్కెట్‌ టర్నోవర్‌.. 
జిల్లాలో వ్యవసాయ రంగం కీలకం కావడంతో నగరంలోని వ్యవసాయ మార్కెట్‌ దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం రూ.1,200కోట్ల టర్నోవర్‌తో రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉన్న మార్కెట్లలో ఒకటిగా నిలిచింది. ప్రధానంగా పత్తి, మిర్చి, వరి పంటలు ఇక్కడ అత్యధికంగా విక్రయిస్తారు. మరోవైపు నగరం విస్తృతం కావడంతో వాణిజ్య పరంగా కార్పొరేట్‌ సంస్థలు సైతం ఖమ్మం వైపు మొగ్గుచూపుతున్నాయి. ఇప్పటికే అనేక షాపింగ్‌ మాల్స్‌ ఏర్పాటు చేయగా.. మరికొన్ని కార్పొరేట్‌ షాపింగ్‌ మాల్స్‌ ఖమ్మం వైపు వచ్చే అవకాశం ఉంది. నగర పరిసర ప్రాంతాల్లో జిల్లా పునర్విభజన నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ రంగం కొద్దిగా వెనుకంజ వేసినప్పటికీ.. నగర అభివృద్ధి నేపథ్యంలో అది తిరిగి పుంజుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని వ్యాపార విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఏదేమైనా ఖమ్మం జిల్లాకు నగరం ప్రస్తుతం కీలకంగా మారింది.
 
విస్తీర్ణం : 93 చ.కి.మీ. 
జనాభా : 3,56,000 
గృహాల సంఖ్య : 98,548 
డివిజన్లు : 50 
 

Advertisement
 
Advertisement
Advertisement