ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అక్రమంగా విదేశాల నుంచి నిధులు సేకరించిందని వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఆప్ నిధులపై వివరణ ఇవ్వండి
Mar 12 2014 10:18 PM | Updated on Apr 4 2018 7:42 PM
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అక్రమంగా విదేశాల నుంచి నిధులు సేకరించిందని వచ్చిన ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై రెండు వారాల్లోపు జవాబు చెప్పాలని ప్రధాన న్యాయమూర్తి బీడీ అహ్మద్నేతృత్వంలోని బెంచ్ కేంద్ర హోంశాఖను ఆదేశించింది. ప్రవాస భారతీయుల నుంచి ఇప్పటికీ నిధులు పొందుతున్న ఆప్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలంటూ ఈ పిల్ దాఖలు చేసిన ఎంఎల్ శర్మ చేసిన విజ్ఞప్తిని బెంచ్ తోసిపుచ్చింది. వేరే బెంచ్లు ఇది వరకే పలుసార్లు ఈ కేసుపై విచారణ నిర్వహించినందున, దీనిని కొత్త బెంచ్కు అప్పగించడం సరికాదని పిటిషనర్ వాదించారు. దీనిపై అహ్మద్ స్పందిస్తూ రోస్టర్ పద్ధతిలో ఈ కేసు తమకు వచ్చిందని, న్యాయవాదులకు కేసు విచారణపై నియంత్రణ ఉండబోదని స్పష్టం చేశారు.ఈ కేసులో ఆప్ అగ్రనేత కేజ్రీవాల్, ఈ పార్టీ నాయకుడు శాంతిభూషణ్, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్కు నోటీసులు జారీ కాలేదు కాబట్టి వాళ్ల నుంచి వివరణ కోరలేమన్నారు. కేసు విచారణ మే ఏడుకు వాయిదా పడింది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్ఆర్ఐల నుంచి విరాళాలు సేకరించలేదని, పూర్తి పారదర్శకంగా వ్యవహరించామని ఇది వరకే ఆప్ కోర్టుకు వివరణ ఇచ్చింది.
Advertisement
Advertisement