ప్రేమించలేదనే అక్కసుతో డాక్టర్ దురాగతం | Delhi acid attack: Victim knew accused doctor, says police | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదనే అక్కసుతో డాక్టర్ దురాగతం

Dec 25 2014 10:35 PM | Updated on Sep 2 2017 6:44 PM

తనను ప్రేమించలేదని తోటి డాక్టర్ యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దానిని చైన్‌స్నాచింగ్‌గా చిత్రీకరించేందుకు యత్నించారు. కానీ మొబైల్

 ఢిల్లీ బ్యూరో: తనను ప్రేమించలేదని తోటి డాక్టర్ యాసిడ్ దాడికి పాల్పడ్డాడు. దానిని చైన్‌స్నాచింగ్‌గా చిత్రీకరించేందుకు యత్నించారు. కానీ మొబైల్ ఆధారంగా అసలు విషయం బయటపడింది.  నిందితులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఇందులో ఒకరు మైనర్ కావడం గమనార్హం. వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలు మహిళా డాక్టరు అమృత్ కౌర్ బెలారుస్‌లో ఎంబీబీఎస్ చదువుతుండగా ఆమెతోపాటు అశోక్‌యాదవ్ చదువుతున్నాడు. ఈ సమయంలోనే అతను కౌర్‌పై ప్రేమను పెంచుకున్నాడు.  కౌర్ అతనిని ప్రేమించలేదు. ఇదిలాఉండగా కౌర్ వివాహం వేరే అతనితో కుదిరింది. ఈ నేపథ్యంలో యాదవ్ అతని స్నేహితుడి సహాయంతో కౌర్‌పై దాడికి వ్యూహం పన్నాడు.
 
 మంగళవారం ఉదయం కౌర్ హరినగర్‌లోని తన ఇంటి నుంచి స్కూటీపై ఈఎస్‌ఐ ఆసుపత్రికి వెళ్తుండగా రాజోరీగార్డెన్‌లో ఫోన్ కాల్ రావడంతో స్కూటీని రోడ్డు పక్కగా ఆపి మాట్లాడుతోంది. మోటారుసైకిల్‌పై ఇద్దరు వ్యక్తులు వచ్చి బైక్‌పై ముందున్న వ్యక్తి బ్యాగ్ లాక్కోవడానికి చూడగా ఆమె ప్రతిఘటించింది. వెనకాల ఉన్న వ్యక్తి ఆమెపై యాసిడ్‌తో దాడికి పాల్పడ్డాడు. దీంతో కౌర్ ముఖం కుడివైపు భాగం దెబ్బతింది. ఆమె కుడి కన్ను పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు పేర్కొంటున్నారు. ఈ ఘటనను బ్యాగ్ స్నాచింగ్  ఘటనగా చూపడానికి ప్రయత్నించిన్పటికీ పోలీసులు అనుమానంతో దర్యాప్తు చేశారు. 12  పోలీసు బృందాలు నిందితుల కోసం గాలింపు జరిపాయి. కౌర్ చేతి నుంచి లాక్కొన్న బ్యాగు పశ్చిమ ఢిల్లీలోని ఖయాలా ప్రాంతంలో, మొబైల్ ఫోన్ యమునా విహార్ ప్రాంతంలో పోలీసులకు దొరికాయి.
 
 మహిళపై దాడి చేసిన తరువాత  నిందితులు బ్యాగ్‌లో నుంచి మొబైల్ ఫోన్ తీసుకొని దానిని స్విచాఫ్ చేసి బ్యాగును పారవేశారని,ట్రాన్స్ యమునా ప్రాంతంలో మళ్లీ మొబైల్ ఆన్ చేశారని పోలీసులు పేర్కొంటున్నారు. మొబైల్ ఫోన్ ఆధారంగానే పోలీసులు నిందితులను గుర్తించారు. పశ్చిమ ఢిల్లీలోని మాదీపుర్ ప్రాంతంలో నిందితులను అరెస్టు చేశారు. ఇదిలాఉండగా దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నగరంలో మహిళా డాక్టర్‌పై జరిగిన యాసిడ్ దాడి కేసులో నిందితులైన డాక్టర్, అతడి స్నేహితుడిని అరెస్టు చేసి, ఇద్దరు బాలురను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement