
సునామీకి పదేళ్లు
సునామీ అనే పేరు పెట్టుకున్న సాగర ప్రళయ బీభత్సానికి నేటితో పదేళ్లు పూర్తయ్యూయి. సరిహద్దు అంచులను దాటి ఊళ్లపై ఎగిసిపడిన కెరటం వేలాదిమందిని మింగేసి
సునామీ అనే పేరు పెట్టుకున్న సాగర ప్రళయ బీభత్సానికి నేటితో పదేళ్లు పూర్తయ్యూయి. సరిహద్దు అంచులను దాటి ఊళ్లపై ఎగిసిపడిన కెరటం వేలాదిమందిని మింగేసి నేటికి దశాబ్ద కాలమైంది. సముద్రతీర జిల్లాల ప్రజల జీవితాల్లో సునామీ చేసిన గాయం ఇంకా ఆరలేదు. క న్నీటి పొరల మాటున ఆనాటి జ్ఞాపకాలు చెరిగిపోలేదు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: 2004 డిసెంబరు 26... తమిళనాడు ప్రజలకు అదో దుర్దినం. సముద్రతీర వాసులకు చెరిగిపోని చేదు జ్ఞాపకం. పిల్లా పాపలతో కళకళలాడే కుటుంబాలను కకావికలం చేస్తూ ప్రకృతి సృష్టించిన ప్రళయం. ఆ రోజు ఆదివారం కావడం, ముందురోజే క్రిస్మస్ పండుగతో ఇంటింటా సందడే సందడి. సముద్రతీర జిల్లాల్లో నివసించే ప్రజలకు ఆదివారం సాగరతీరంలో ఉల్లాసంగా గడపడం అలవాటు. సముద్రం వద్దకు మనం వెళ్లడం కాదు, ఏదో ఒకరోజు సముద్రమే మన వద్దకు వస్తుందని కలలో కూడా వారు ఊహించి ఉండరు. కానీ ఆరోజు అదే జరిగింది. సమద్ర అనే దీవుల్లో ఏర్పడిన భూకంపం సముద్రాన్ని అల్లకల్లోలం చేసింది. ఎగిసిపడే కెరటాల్లో కల్లోలాన్ని రేకెత్తించింది. కేవలం కొద్ది నిమిషాల్లో అలలపోటును సృష్టించింది. ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఆ కెరటాలు ఊళ్లను ముంచేశాయి. ఐదు అడుగులకు మించిన ప్రవాహం వేలాదిమందిని లాక్కుని వెళ్లిపోయింది.
ఇలా తమిళనాడులో 1700 మంది చనిపోయినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ ఈ సంఖ్య పదివేలను మించిపోయిందని అనధికార సమాచారం. ఊళ్లలోకి చొరబడిన సునామీ కెరటాలు తిరిగి అదే వేగంతో వెనక్కుమళ్లాయి. అప్పటి వరకు నివాసగృహాలుగా ఉన్న ప్రాంతాలు శ్మశానాలుగా మారిపోయాయి. ఎక్కడ చూసిన శవాల గుట్టలు, వారిని చూసి విలపిస్తూ బంధువుల ఆక్రందనలు. గల్లంతైనవారి కోసం ఆందోళనలు మిన్నంటాయి. అయినవారినేగాక ఇళ్లను, ఆస్తులను కోల్పోయి వేలాది మంది అనాథలుగా మిగిలారు. రాష్ట్రంలో కడలూరు, నాగపట్నం, కన్యాకుమారీ, రామేశ్వరం తదితర సుముద్రతీర జిల్లాల ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘోరపరిణామం చోటుచేసుకుని పదేళ్లయినా బాధితుల గుండెల్లో ఇంకా ఆవేదనల తడి ఆరలేదు. కన్నీటి చారలు వీడలేదు. చనిపోయిన వారి జ్ఞాపకాలు చెదిరిపోలేదు. ప్రతి ఏడాది డిసెంబరు 26ను సునామీ మృతుల శ్రద్ధాంజలి దినంగా ప్రజలు తమంతట తాముగానే జరుపుకుంటున్నారు. మత్స్యకార కుటుంబాలు చేపల వేటకు వెళ్లకుండా నివాళులర్పిస్తున్నారు.
అసంపూర్తి ఇళ్లతో అవస్థలు
సునామీ బాధిత ప్రాంతాల్లో పక్కా గృహాల నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోయి అధికారుల అలక్ష్యానికి సాక్ష్యంగా నిలిచింది. కడలూరు జిల్లాలో 51 మత్స్యగ్రామాలు ఉండగా, సునామీ ధాటికి 617 మంది మృత్యువాత పడగా, 38 మంది గల్లంతయ్యూరు. వీరి జాడ ఇంతవరకు లేదు. ఇక్కడి జాలర్ల కోసం రూ.14.75 కోట్లతో 538 సునామీ గృహాలు నిర్మించ తలపెట్టారు. 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కో ఇంటికి రూ.2.75 లక్షలు కేటాయించారు. 2009లో నిర్మాణ పనులు ప్రారంభమైనా నేటికీ అన్ని ఇళ్లు పూర్తికాలేదు. పూర్తయిన ఇళ్లను మత్స్యకారులకు కాకుండా వేరేవారు ఆక్రమించారు. అదేమని ప్రశ్నించిన జాలర్లను బెదిరిస్తున్నారు. నిర్మించి ఐదేళ్లు కూడా పూర్తికాకమునుపే ఇంటి గోడలు బీటలు వారాయి. వర్షాకాలంలో ఏమాత్రం నివసించలేని నాశిరక నిర్మాణాలు చేపట్టారు. రోడ్లు, తాగునీరు, విద్యుత్, వీధిదీపాల వసతి లేదు. సునామీ మృతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.2లక్షలు అందజేశాయి. ఈ లెక్కన రూ.1200 కోట్లను పంపిణీ చేసినట్లు డిజాస్టర్ మేనేజిమెంట్ జాయింట్ డెరైక్టర్ ఎస్ కందస్వామి తెలిపారు. నష్టపరిహార పంపిణీ, సునామీ బాధిత ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పూర్తయినట్లు వివరించడం విశేషం.