మెయిన్‌ ‘డ్రా’కు కశ్యప్‌ | Parupalli kashyap Qualified For Main Draw In Singapore Open Badminton Tournament | Sakshi
Sakshi News home page

మెయిన్‌ ‘డ్రా’కు కశ్యప్‌

Apr 10 2019 9:10 AM | Updated on Apr 10 2019 9:10 AM

Parupalli kashyap Qualified For Main Draw In Singapore Open Badminton Tournament - Sakshi

సింగపూర్‌ : సింగపూర్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత సీనియర్‌ ఆటగాడు పారుపల్లి కశ్యప్‌ మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సంపాదించాడు. ర్యాంకింగ్స్‌లో దిగువన ఉండటంతో అతను క్వాలిఫయింగ్‌ ఈవెంట్‌లో పోటీపడ్డాడు. మంగళవారం రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన కశ్యప్‌ మెయిన్‌ డ్రా పోటీలకు సిద్ధమయ్యాడు. పురుషుల సింగిల్స్‌ క్వాలిఫికేషన్‌ తొలి రౌండ్లో ఈ భారత వెటరన్‌ షట్లర్‌ 21–5, 14–21, 21–17తో మలేసియాకు చెందిన చిమ్‌ జున్‌ వీపై గెలుపొందాడు. అనంతరం జరిగిన రెండో రౌండ్లో కశ్యప్‌ 15–21, 21–16, 22–20తో జపాన్‌ ఆటగాడు యు ఇగరషిపై చెమటోడ్చి నెగ్గాడు.

మరోవైపు మహిళల సింగిల్స్‌లో ముగ్ధా ఆగ్రే కూడా మెయిన్‌ డ్రాకు అర్హత పొందింది. ఆమె క్వాలిఫయింగ్‌లో 16–21, 21–14, 21–15తో అమెరికా షట్లర్‌ లారెన్‌ లామ్‌పై గెలిచింది. నేడు జరిగే ప్రధాన డ్రా తొలి మ్యాచ్‌లో రస్ముస్‌ గెమ్కే (డెన్మార్క్‌)తో కశ్యప్, పోర్న్‌పవి చొచువాంగ్‌ (థాయ్‌లాండ్‌)తో ముగ్ధా ఆగ్రే పోటీపడతారు. పురుషుల డబుల్స్‌ మెయిన్‌ డ్రా తొలి రౌండ్‌లో ఎం.ఆర్‌. అర్జున్‌–శ్లోక్‌ రామచంద్రన్‌ జోడీ 11–21, 18–21తో ఆరో సీడ్‌ కిమ్‌ అస్ట్రప్‌–అండర్స్‌ స్కారప్‌ (డెన్మార్క్‌) జోడీ చేతిలో ఓడింది. ఈ రోజు జరిగే మెయిన్‌ డ్రా పోటీల్లో భారత స్టార్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌లు తమ సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement