డీఎస్పీగా మహిళా టీ20 కెప్టెన్‌  | Indian Womens T20 Captain Harmanpreet Joins Punjab Police | Sakshi
Sakshi News home page

డీఎస్పీగా మహిళా టీ20 కెప్టెన్‌ 

Mar 1 2018 7:47 PM | Updated on May 25 2018 5:52 PM

Indian Womens T20 Captain Harmanpreet Joins Punjab Police - Sakshi

ఛండీగర్‌ : భారత మహిళల క్రికెట్ జట్టు టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, డిప్యూటీ సూపరిటెండెంట్‌ ఆఫ్‌ పోలీసుగా కొత్త బాధ్యతలు చేపట్టారు. నేటి(గురువారం) నుంచి ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు. పంజాబ్‌ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు(డీజీపీ) సురేష్‌ అరోరాలు హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ యూనిఫాంకు స్టార్లను పిన్‌ చేసి నూతన బాధ్యతలు అప్పజెప్పారు. ''యంగ్‌ క్రికెటర్‌ హర్మన్‌ ప్రీత్‌కు ఈ బాధ్యతలు అప్పజెప్పడంలో పాల్గొనడం ఎంతో గర్వకారణం. హర్మన్‌ ప్రీత్‌ పంజాబ్‌ పోలీసు విభాగంలో డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. హర్మన్‌ ప్రీత్‌ మాకు ఎంతో గర్వకారకంగా నిలిచింది. ఆమె ఇలానే కొనసాగిస్తుందని నేను నమ్ముతున్నా. నా శుభాకాంక్షలు ఆమెతో ఎప్పటికీ ఉంటాయి'' అని అమరీందర్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు.

గతేడాది జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భారత జట్టు ఫైనల్‌కు రావడంతో హర్మన్‌ప్రీత్ కీలక పాత్ర పోషించింది. దీంతో హర్మన్ ప్రీత్ కౌర్‌కు పంజాబ్ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగం ఇస్తున్నట్లు గత జులైలో ప్రకటించింది. పోలీసు ఉద్యోగం అంటే బాగుంటుందని కాబట్టి డీఎస్పీ పోస్టుని తీసుకునేందుకు గాను హర్మన్ ప్రీత్ తాను చేస్తున్న రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయితే పశ్చిమ  రైల్వేతో ఐదేళ్ల ఒప్పందం కుదుర్చుకోవడంతో రిలీవ్ చేసేందుకు అధికారులు నిరాకరించారు. అయినా వెళ్లాలనుకుంటే ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐదేళ్ల వేతనం రూ.27 లక్షలు చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంలో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ జోక్యం చేసుకుని, రైల్వే మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాస్తూ హర్మన్ సమస్యను వేరే కోణంలో చూడాలని, ఆమె రాజీనామాను ఆమోదించాలని కోరారు. ముఖ్యమంత్రి లేఖతో దిగివచ్చిన రైల్వే, హర్మన్ ప్రీత్‌తో కుదుర్చుకున్న బాండ్‌ను రద్దు చేసింది. దీంతో పోలీసు ఉద్యోగంలో చేరేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఈ క్రమంలో ఆమె నేడు డీఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించింది.

Advertisement
 
Advertisement
Advertisement