భారత మహిళలదే టి20 సిరీస్‌ | India Women Team Won The T20 Series Against The West Indies | Sakshi
Sakshi News home page

భారత మహిళలదే టి20 సిరీస్‌

Nov 16 2019 4:54 AM | Updated on Nov 16 2019 4:54 AM

India Women Team Won The T20 Series Against The West Indies - Sakshi

ప్రావిడెన్స్‌ (గయానా): మరోసారి ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన భారత మహిళల టి20 క్రికెట్‌ జట్టు ప్రపంచ చాంపియన్‌ వెస్టిండీస్‌పై ‘హ్యాట్రిక్‌’ విజయం నమోదు చేసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే 3–0తో సొంతం చేసుకుంది. శుక్రవారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు కేవలం 59 పరుగులే చేసింది. భారత బౌలర్లలో రాధా యాదవ్‌ (4–2–6–2), దీప్తి శర్మ (4–0–12–2) రెండేసి వికెట్లు తీయగా... అనూజా పాటిల్, పూజా వస్త్రకర్, హర్మన్‌ప్రీత్‌ కౌర్, పూనమ్‌ యాదవ్‌లకు ఒక్కో వికెట్‌ లభించింది. విండీస్‌ జట్టులో చెడీన్‌ నేషన్‌ (11), చినెల్లి హెన్రీ (11) మాత్రమే రెండంకెల స్కోరు దాటారు. అనంతరం భారత్‌ 16.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసి గెలిచింది. షఫాలీ వర్మ (0), స్మృతి మంధాన (3), హర్మన్‌ (7) తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా... జెమీమా రోడ్రిగ్స్‌ (51 బంతుల్లో 40 నాటౌట్‌; 4 ఫోర్లు), దీప్తి శర్మ (7 నాటౌట్‌) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు.

Advertisement
 
Advertisement
Advertisement