గీతాంజలి జట్టుకు టీమ్‌ చాంపియన్‌షిప్‌ | Geetanjali Team Won Table Tennis Championship | Sakshi
Sakshi News home page

గీతాంజలి జట్టుకు టీమ్‌ చాంపియన్‌షిప్‌

Jul 28 2018 10:14 AM | Updated on Jul 28 2018 10:14 AM

Geetanjali Team Won Table Tennis Championship - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సెయింట్‌ పాల్స్‌ వార్షిక తెలంగాణ రాష్ట్ర ర్యాంకింగ్, ఇంటర్‌ స్కూల్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌లో గీతాంజలి దేవాశ్రయ్‌ జట్టు సత్తా చాటింది. శుక్రవారం ప్రారంభమైన ఈ టోర్నీలో బాలికల టీమ్‌ చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో గీతాంజలి దేవాశ్రయ్‌ 3–0తో చిరెక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ‘ఎ’ కొండాపూర్‌పై గెలుపొంది టైటిల్‌ను దక్కించుకుంది. తొలుత జరిగిన రెండు సింగిల్స్‌ మ్యాచ్‌ల్లో విధి జైన్‌ 9–11, 11–6, 8–11, 11–9, 15–13తో ఐశ్వర్యపై, రెండో మ్యాచ్‌లో భవిత 11–8, 11–7, 11–7తో అనన్యపై గెలిచి జట్టుకు విజయాన్ని ఖాయం చేశారు.

నామమాత్రమైన డబుల్స్‌ మ్యాచ్‌లోనూ విధి జైన్‌– భవిత ద్వయం 11–8, 11–9, 11–6తో ఐశ్వర్య– పూజపై నెగ్గి గెలుపును పరిపూర్ణం చేసింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో గీతాంజలి దేవాశ్రయ్‌ 3–0తో సెయింట్‌ పాల్స్‌ హైస్కూల్‌పై గెలుపొందగా, చిరెక్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ 3–0తో ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ నాచారంను ఓడించింది.

మరోవైపు బాలుర టీమ్‌ విభాగంలో సెయింట్‌ పాల్స్‌ హైస్కూల్‌ ‘ఎ’, చిరెక్‌ ‘బి’ జట్లు టైటిల్‌పోరుకు సిద్ధమయ్యాయి. సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లో సెయింట్‌ పాల్స్‌ హైస్కూల్‌ 3–0తో చిరెక్‌ ‘ఎ’పై, చిరెక్‌ ‘బి’ జట్టు 3–2తో సెయింట్‌ పాల్స్‌ హైస్కూల్‌ ‘బి’ జట్టుపై విజయం సాధించాయి. పోటీలకు ముందు జరిగిన టోర్నమెంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రంజీ ప్లేయర్‌ మెహదీ హసన్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించాడు. ఈ కార్యక్రమంలో స్కూల్‌ ప్రిన్సిపల్‌ రెవరెండ్‌ బ్రదర్‌ రాయప్ప రెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement