
ఢిల్లీ టెస్టుపై నీలి నీడలు!
క్షిణాఫ్రికా-టీమిండియాల టెస్టు సిరీస్ లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో వచ్చే నెలల జరుగనున్న చివరిదైన నాల్గో టెస్టుపై నీలి నీడలు అలుముకున్నాయి.
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికా-టీమిండియాల టెస్టు సిరీస్ లో భాగంగా ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో వచ్చే నెలల జరుగనున్న చివరిదైన నాల్గో టెస్టుపై నీలి నీడలు అలుముకున్నాయి. ఢిల్లీ క్రికెట్ సంఘం (డీడీసీఏ)లో చోటు చేసుకున్న అవినీతి ఆరోపణలపై రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరు సభ్యుల ప్యానెల్ ను తాజాగా ఏర్పాటు చేయడమే ఇందుకు ప్రధాన కారణం. 2008-12 మధ్య కాలంలో రాష్ట్ర ప్రభుత్వానికి డీడీసీఏ వినోదపు పన్ను చెల్లించని కారణంగా దానిపై దర్యాప్తుకు కేజ్రీవాల్ ఆదేశించారు. గత అక్టోబర్ లో వినోదపు పన్ను రూపంలో ప్రభుత్వానికి రూ.24.45 కోట్లు చెల్లించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా, అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని.. ఆ సమయంలో పన్ను మినహాయింపు రూపంలో వచ్చిన డబ్బును ఎలా చెల్లిసామని డీడీసీఏ వైస్ ప్రెసిడెంట్ చేతన్ చౌహాన్ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించడంతో నాల్గో టెస్టు జరుగుతుందా?లేదా?అనేది సందేహాస్పదంగా మారింది.
ఇదిలా ఉండగా డీడీసీఏపై మరో భారత మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. డీడీసీఏలో అవినీతి ఆరోపణలపై కేజ్రీవాల్ కల్పించుకోవడం నిజంగా అభినందించదగ్గ విషయమన్నారు. ప్రస్తుత సమయంలో ఢిల్లీలో టెస్టు మ్యాచ్ జరిపేందుకు డీడీసీఏ ఆరోగ్యకరంగా లేదంటూ సెటైర్లు గుప్పించారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్టలో చివరి టెస్టు జరిగే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. ఒకవేళ అక్కడ టెస్టు మ్యాచ్ జరగని పక్షంలో ఆమ్యాచ్ ను తాజాగా టెస్టు హోదా పొందిన పుణేలో నిర్వహించే అవకాశం ఉంది.