రేపే అవిశ్వాసం.. ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదా పోరాటంలో మరో కీలక ఘట్టం.. సోమవారం లోక్సభ ముందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద పెట్టిన అవిశ్వాసం తీర్మానం చర్చకు రానుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. ఏపీకి సంజీవని వంటి ప్రత్యేక హోదా కోసం పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతునివ్వాలని మరోసారి అన్ని పార్టీలను వైఎస్ఆర్సీపీ ఎంపీలు కోరారు.
ఫిబ్రవరి 13న వైఎస్ జగన్ ప్రకటన చేసిననాటినుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీలు కేంద్రంలో దూకుడు పెంచిన సంగతి తెలిసిందే. మార్చి 21న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతానని మొదట ప్రకటించిన వైఎస్ జగన్.. .ఆ తరువాత వ్యూహం మార్చి అవిశ్వాసం తేదీని ముందుకు కదిపారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయినప్పటినుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీలు పార్లమెంటులో ప్రత్యేక హోదా గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమో చాటుతూ.. ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ చేసిన పోరాటాల గురించి అన్ని పార్టీలకు తెలిసేలా వైఎస్ జగన్ లేఖ రాశారు. ఆ లేఖ ప్రతులను పార్టీ ఎంపీలు లోక్సభ ప్రాంగణంలోని ఎంపీలకు పంచారు. లేఖతో అన్ని పార్టీల ఎంపీలకు నిజాలు తెలియజేసేందుకు ప్రయత్నించారు. అంతేకాదు, పలు జాతీయ, ప్రాంతీయ పార్టీ నేతలను కలిసి తమ అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ఐదు కోట్ల ఆంధ్రుల అజెండాను తమ భుజాన వేసుకున్న వైఎస్ఆర్సీపీ ఎంపీలు.. తృణమూల్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, శివసేన, కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్పీ, అకాళీదల్, బిజూ జనతాదళ్ నేతలను కలిసి ప్రత్యేక హోదా కోసం తాము పెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని కోరిన సంగతి తెలిసిందే. వైఎస్ఆర్సీపీ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న పోరాటాలు, అంకితభావాన్ని మొదటనుంచి గమనిస్తున్న చాలా పార్టీలు పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తామని హామీ ఇచ్చాయి.