ఏ పని సక్రమంగా చేశావు బాబూ..!

YSRCP MLA Candidate Srikanthreddy Election Campaign In Galiveedu - Sakshi

చంద్రబాబుపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి  

సాక్షి, గాలివీడు: పద్నాలుగేళ్ల మీ పాలనలో ఏ పని సక్రమంగా చేశావని చంద్రబాబు తీరుపై ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలం పరిధిలోని అరవీడు, గాలివీడు, గోరాన్‌చెరువు గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు పాలన అంతా ప్రచార ఆర్భాటం తప్పా అభివృద్ధి శూన్యమన్నారు. ఆదివారం రాయచోటిలో సీఎం బహిరంగ సభకు కోట్లు ఖర్చు చేశారన్నారు. దివంగత సీఎం వైఎస్సార్‌ హయాంలో రాయచోటికి తాగునీరు, వెలిగల్లు, ఘరికోన, శ్రీనివాసపురం రిజర్వాయర్‌లు నిర్మించడం, రింగ్‌రోడ్డు, విద్యాలయాలు తదితర ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. కృష్జా జలాలను రాయచోటి ప్రాంతానికి రానివ్వకపోవడమే కాకుండా, ఆ జలాలను కుప్పంకు తరలించే కాంట్రాక్ట్‌ పనులు ఇక్కడి టీడీపీ నేతలకు కట్టబెట్టి రాయచోటి వాసుల గొంతు కోయలేదా అని ప్రశ్నించారు. 2016 కల్లా రాయచోటికి కృష్ణా జలాలను ఇస్తామని అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. ఆ హామీని నేటికి నెరవేర్చలేదని ఆయన మండిపడ్డారు.  

వాస్తవాలు మాట్లాడుతుంటే దురుసుగా ప్రవర్తిస్తావా..?
చంద్రబాబు కన్నా సీనియర్‌ నాయకుడు, మాజీ శాసన సభ్యుడు సుగవాసి పాలకొండ్రాయుడు వాస్తవాలను మాట్లాడుతుంటే కనీస గౌరవం లేకుండా మైక్‌ లాక్కొని దురుసుగా ప్రవర్తిస్తావా అని విమర్శించారు. ఆరోగ్య శ్రీ, 108, 104, ఫీజు రీయింబర్స్‌మెంట్‌  పథకాలను అమలు చేసి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న చరిత్ర వైఎస్సార్‌దేనన్నారు. బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువ సీట్లు కేటాయించిన ఘనత వైఎస్సార్‌సీపీకే దక్కుతుందన్నారు.

బీసీలు ఉన్నత పదవులుకు పనికిరారని, ఎస్సీల్లో ఎవరూ పుట్టాలనుకుంటారని చెప్పిన వ్యక్తి  చంద్రబాబేనన్నారు. తాము అధికారంలోకి వస్తే మొట్టమొదటి ఎమ్మెల్సీ మైనార్టీలకు కేటాయిస్తామని తమ అధినేత జగన్‌ ఎప్పుడో ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. 15 ఏళ్లు అధికారంలో ఉన్న మీకు పట్టణంలో ప్రభుత్వ కళాశాల స్థల విషయం గుర్తుకు రాలేదా అని చంద్రబాబును ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ సీఎం అయితే నియోజకవర్గంలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. రూ.20 కోట్లకు ప్రశ్నపత్రాలను అమ్ముకున్న వారిని చట్టం ముందు నిలబెడతామని  తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ జల్లా సుదర్శన్‌రెడ్డి, నాయకులు యధుభూషణ్‌రెడ్డి, ç ఉమాపతిరెడ్డి, మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్‌మోద్దీన్, బీసీ సెల్‌ అధ్యక్షుడు వల్లపునాగేష్, మహిళా మండల అధ్యక్షురాలు వెలిగింటి నాగేశ్వరమ్మ, ఎస్టీ సెల్‌ అధ్యక్షులు హనుమాన్‌నాయక్, ఎస్సీ సెల్‌ అధ్యక్షులు ప్రసాద్‌ పాల్గొన్నారు.  

ప్రజాసంక్షేమమే వైఎస్సార్‌సీపీ ధ్యేయం
రాయచోటి: ప్రజాసంక్షేమమే వైఎస్సార్‌సీపీ ధ్యేయమని, ప్రతి ఒక్కరూ ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని గడికోట శివలలిత ఓటర్లను కోరింది. మున్సిపాలిటీ పరిధిలోని 8, 9, 10 వార్డుల్లో సోమవారం స్థానిక కౌన్సిలర్లు, నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి సాధించాలంటే వైఎస్సార్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. టీడీపీ పాలనలో మహిళలకు సరైన గౌరవం లభించకపోగా డ్వాక్రా రుణాల మాఫీలో తీరని అన్యాయం జరిగిందని వివరించారు. జగనన్న అధికారంలోకి వస్తే డ్వాక్రా రుణాల మాఫీ కావడంతో పాటు వృద్ధులకు రూ.3 వేల పింఛన్‌ వస్తుందన్నారు. ప్రచారంలో పట్టణ మైనార్టీ మహిళ అధ్యక్షురాలు నాజీనీన్, ఉపాధ్యక్షురాలు జబీన్, కౌన్సిలర్లు ఫయాజుర్‌ æరెహమాన్, వెంకటరామిరెడ్డి, కొలిమి చాన్‌బాషా, సలీమ్, రెహమాన్, ఫయాజ్‌ అహమ్మద్,  గంగిరెడ్డి, చెన్నూరు అన్వర్‌బాషా, నిస్సార్‌అహమ్మద్, విక్కీ, దేవేంద్ర, అమీర్‌ పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top