జెడ్పీ చైర్‌పర్సన్‌గా గండ్ర జ్యోతి!  | Warangal ZP Chairperson Election | Sakshi
Sakshi News home page

జెడ్పీ చైర్‌పర్సన్‌గా గండ్ర జ్యోతి! 

Jun 8 2019 11:57 AM | Updated on Jun 8 2019 11:57 AM

Warangal ZP Chairperson Election - Sakshi

గండ్ర జ్యోతి

సాక్షి, వరంగల్‌ రూరల్‌:  రూరల్‌ జిల్లా పరిషత్‌  చైర్‌పర్సన్‌ పదవి గండ్ర జ్యోతికి దక్కనుంది. జిల్లాలో 16 జెడ్పీటీసీలకు మూడు దశల్లో మే 6, 10, 14 తేదీల్లో ఎన్నికలు జరిగాయి. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. 16 జెడ్పీటీసీలకు 16 జెడ్పీటీసీలను టీఆర్‌ఎస్‌ గెలుపొంది క్లీన్‌ స్వీప్‌ చేసింది. గెలుపొందిన జెడ్పీటీసీలను వెంటనే టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు క్యాంపునకు తీసుకవెళ్లారు. శనివారం ఉదయం 9గంటలకు వరంగల్‌ రూరల్‌ కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో జెడ్పీచైర్‌పర్సన్‌ ఎన్నిక జరగనుంది. ఇప్పటికే జిల్లా యంత్రాంగం ఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేసింది. చైర్‌పర్సన్‌తో పాటు వైఎస్‌ చైర్మన్, కో ఆప్షన్‌ సభ్యుల ఎన్నిక జరుగుతుంది.

జ్యోతికే చాన్స్‌
శాయంపేట జెడ్పీటీసీ సభ్యురాలుగా గండ్ర జ్యోతి ఎన్నికయ్యారు. ఇటీవల కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌లో గండ్ర జ్యోతి చేరారు. ఇటీవల టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి కలిశారు. గండ్ర జ్యోతికి జెడ్పీచైర్‌పర్సన్‌గా అవకాశం కల్పిస్తామని కేటీఆర్‌ హమీ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో వెంటనే టీఆర్‌ఎస్‌లో చేరి ఆ పార్టీ తరఫున జెడ్పీటీసీ సభ్యురాలుగా నామినేషన్‌ వేసింది. 10వేల మెజార్టీతో శాయంపేట జెడ్పీటీసీగా గెలుపొందారు. దీంతో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా గండ్ర జ్యోతికి చాన్స్‌ దక్కనుంది. జ్యోతి టీఆర్‌ఎస్‌లో చేరకుముందు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అందరు ఏకాభిప్రాయంతో నర్సంపేట నియోజకవర్గానికి జెడ్పీచైర్‌పర్సన్‌గా అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. జ్యోతి టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడంతో సీన్‌ రివర్స్‌ అయింది. జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నికకు నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలను పార్టీ అధిష్టానం అప్పగించింది.

Advertisement
 
Advertisement
Advertisement